మూడు రాజధానులు ఖాయం-బిల్లులు మాత్రం వెనక్కి-హైకోర్టు దూకుడే కారణమా ?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ సర్కార్ గతంలో రెండు కీలక బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదించింది. ఆ తర్వాత మండలిలో ఆమోదం పొందకపోయినా గవర్నర్ సాయంతో వాటిని నెగ్గించుకుంది. ఇక హైకోర్టు కూడా వాటికి క్లియరెన్స్ ఇచ్చేస్తే మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని అంతా భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. ఇందుకు ఒకటో, రెండో శాతం వ్యతిరేకతే కారణమని పైకి చెప్తున్నా అంతకు మించిన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు రాజధానులపై వెనక్కి
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ విషయంలో గతంలో ఎవరూ ఉహించని విధంగా, దూకుడుగా ముందుకెళ్లిన వైసీపీ సర్కార్ ఇప్పుడు అంతే ఊహించని పరిణామాల మధ్య దీనిపై వెనక్కి తగ్గింది. అప్పట్లో జీఎస్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికల్ని అడ్డుపెట్టి అసెంబ్లీలో రాజధాని బిల్లుల్ని ప్రవేశపెట్టిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు మరోసారి సమీక్షకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విస్తృత, విశాల ప్రజాప్రయోజనాల కోసమే బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకు ప్రధాన కారణంగా వీటిని వ్యతిరేకిస్తున్న ఒకటో, అరశాతమో ప్రజల్లో ఉన్న అపోహలే కారణమన్నారు. దీంతో ఒకశాతం వ్యతిరేకతతో జగన్ వెనక్కి తగ్గి ఉంటారా అన్న చర్చ సాగుతోంది.

ఒకట్రెండు శాతం వ్యతిరేకత అన్న జగన్
రాజధానుల బిల్లుల్ని తాము ఉపసంహరించుకోవడానికి జగన్ చూపిన ప్రధాన కారణం ఒకట్రెండు శాతం ప్రజా వ్యతిరేకత. వారిలో నెలకొన్న అపోహలే ఇందుకు కారణమన్నారు. కానీ నిజంగా ఒకట్రెండు శాతం ప్రజల్లో ఉన్న అపోహలతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందా, లేక వెనక్కి తగ్గుతుందా అన్న చర్చ సాగుతోంది. అలా అయితే ప్రభుత్వం తీసుకునే చాలా నిర్ణయాలపై అంతకు మించిన వ్యతిరేకత ఉంటూనే ఉంది. అలా అని ప్రతీ నిర్ణయాన్నీ వెనక్కి తీసుకుంటూ వెళ్లే పరిస్ధితి ఉందా అంటే దానికి సర్కార్ వద్ద సమాధానం లేదు. దీంతో అంతకుమించిన కారణాలతోనే ప్రభుత్వం ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకుంటుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.

స్పీడు పెంచిన హైకోర్టు
వైసీపీ సర్కార్ ప్రారంభించిన మూడు రాజధానుల ప్రక్రియను వ్యతిరేకిస్తూ హైకోర్టులో వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇప్పటికే రెండుసార్లు మొదలై ఆగిపోయిన విచారణ తాజాగా మరోసారి మొదలైంది. అయితే గతానికి భిన్నాంగా ఈసారి విచారణ దూకుడుగా సాగుతోంది. తొలిరోజే ఈ పిటిషన్లను విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని వైసీపీ సర్కార్ హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రాను కోరింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. అంతే కాదు మూడు రాజధానులపై వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఓ దశలో రాజధాని పోరును స్వాతంత్ర్య పోరాటంతో కూడా పోల్చారు. దీంతో ఈ విచారణ సీరియస్ నెస్ పెరిగిపోయింది.

జగన్ సర్కార్ భయాలివేనా ?
రాజధాని పిటిషన్లపై హైకోర్టులో ప్రస్తుతం సాగుతున్న విచారణ ఇదే తీరుగా ఉంటే భవిష్యత్తులో తాము చేపట్టిన మూడు రాజధానుల వ్యవహారంలో చిక్కులు తప్పవని వైసీపీ సర్కార్ భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసుల్ని వాదిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ దుష్యంత్ దవే కూడా ఇదే విషయాన్ని వైసీపీ సర్కార్ కు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని బిల్లుల్ని అసెంబ్లీలో నెగ్గించుకున్నా.. అప్పట్లో మెజారిటీలేని మండలిలో బైపాస్ చేసి ముందుకెళ్లిన తీరు ఇబ్బందులు కలిగించక తప్పదని తేలిపోయింది. దీంతో పాటు రాజధాని రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా అమలు చేయకుండా ముందుకెళ్తే చిక్కులు తప్పవని తేలిపోయింది. ఈ రెండు అంశాలే ప్రధానంగా వైసీపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకునేందుకు దారి తీసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications