అమరావతి పాదయాత్ర ఆంక్షలు-నేడు తేల్చనున్న హైకోర్టు-కీలకంగా ఆ ఒక్క పాయింట్ !
అమరావతి రైతుల పాదయాత్రపై ఇవాళ హైకోర్టు కీలక విచారణ చేపట్టబోతోంది. నిన్న అమరావతి రైతుల పిటిషన్ పై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు.. నవంబర్ 1న ఛీఫ్ జస్టిస్ ధర్మాసనం వద్దే తేల్చుకోవాలని సూచించింది. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఇవాళ మధ్యాహ్నం అన్ని పిటిషన్లపై విచారణ జరపాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమరావతి పాదయాత్రపై ఆంక్షలు
అమరావతి రాజధాని కోరుతూ రైతులు అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రకు పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వ ఆంక్షలపై రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ముందుగా విధించిన షరతుల ప్రకారమే పాదయాత్ర సాగాలని సూచించింది. దీంతో పోలీసులు పాదయాత్ర చేస్తున్నవారిని కట్టడి చేయడం ఆరంభించారు. దీంతో రైతులు పాదయాత్రను నిలిపేశారు.

అత్యవసర విచారణకు హైకోర్టు నో
హైకోర్టు ఆదేశాల తర్వాత పోలీసులు తమను కట్టడి చేస్తున్నారని, ఆంక్షలతో ముందుకుసాగలేమంటూ రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు నిన్న హైకోర్టు నిరాకరించింది. గతంలో పాదయాత్రకు అనుమతి ఇచ్చిన సమయంలో పెట్టిన షరతులు కొనసాగుతాయని, వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదని, దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని నిన్న నిస్సహాయత వ్యక్తం చేసింది. అదే సమయంలో నవంబర్ 1న ఛీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ఈ వ్యవహారం తేల్చుకోవాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది.

నేడు విచారణ
అమరావతి మహాపాదయాత్ర రద్దు చేయాలని దాఖలైన అనుబంధ పిటిషన్ తో పాటు ఇప్పటికే రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ నిర్వహించేందుకు హైకోర్టు నిన్న అంగీకరించింది. నిన్న లంచ్ మోషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు.. అనంతరం పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు ఇవాళ మధ్యాహ్నం అన్ని పిటిషన్లపై విచారణ నిర్వహించేందుకు అంగీకరించింది. అయితే పాదయాత్రకు అనుమతి సమయంలో పెట్టిన ఆంక్షలు ఏకపక్షంగా ఎత్తేసేందుకు మాత్రం హైకోర్టు ససేమిరా అంటోంది.

సంఘీభావమే అసలు సమస్య ?
వాస్తవానికి హైకోర్టు అమరావతి పాదయాత్రకు గతంలో అనుమతి ఇచ్చిన సమయంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారు రోడ్డుకు ఇరువైపులా మాత్రమే ఉండి మద్దతివ్వాలని సూచించింది. అయితే టీడీపీతో పాటు ఇతర విపక్ష పార్టీల నాయకులు పాదయాత్రలోకి వచ్చి నడుస్తున్నారు. దీనికి ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది. అలాగే పాదయాత్రలో 600 మంది వరకూ పాల్గొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు మాత్రం 150 మందికే పాసులు ఇచ్చారు. వారిలోనూ 60 మందే రైతులు ఉన్నారంటూ వైసీపీ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో మిగతా వారిని ఐడీ కార్డుల పేరుతో పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ విచారణలో హైకోర్టు దీనిపై కీలక నిర్ణయంతీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications