నిమ్మగడ్డ పిటిషన్పై ట్విస్ట్-నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి-గవర్నర్కు లేఖల లీకుపై
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్గా సాగిపోతున్న ముఖాముఖీ పోరులో రోజుకో ట్విస్ట్ తప్పడం లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేయగా.. అందులో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీతో ప్రివిలేజ్ నోటీసులు ఇప్పించారు. వీటికి ఘాటుగా సమాధానం ఇచ్చిన నిమ్మగడ్డ.. అసలు తాను గవర్నర్కు రాసిన లేఖలు లీక్ కావడంపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

సీబీఐ విచారణ కోరుతూ నిమ్మగడ్డ పిటిషన్
మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గవర్నర్ హరిచందన్కు తాను చేసిన ఫిర్యాదు లేఖ ప్రభుత్వంతో పాటు ఇతరులకూ లీక్ కావడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటికి వస్తాయని కోరుతూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్లో నిమ్మగడ్డ.. ప్రభుత్వం తీరుపై ఆక్షేపణ తెలిపారు. గవర్నర్కు రాసిన లేఖలు ప్రభుత్వం వద్దకు ఎలా లీకవుతున్నాయని ప్రశ్నించారు.

నిమ్మగడ్డ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
గవర్నర్కు తాను రాసిన లేఖలు లీక్ కావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ కావాలని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. దీంతో పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అంటూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ పిటిషన్ను ఛీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లి వేరే బెంచ్కు బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్కు సూచించారు. దీంతో ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

విచారణ జరపనున్న ఛీఫ్ జస్టిస్
నిమ్మగడ్డ గవర్నర్ హరిచందన్కు రాసిన లేఖల లీకేజీపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తి తప్పుకోవడంతో ఇప్పుడు ఛీఫ్ జస్టిస్ బెంచ్ ముందు దీన్ని విచారించనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన కేసు కావడం, రాజ్యాంగ సంస్ధలకు అధిపతులైన గవర్నర్, ఎస్ఈసీతో పాటు ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర ఉన్నందున ఈ కేసును ఛీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి తానే స్వయంగా విచారణకు స్వీకరిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఛీఫ్ జస్టిస్ తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారబోతోంది.

నిమ్మగడ్డ పిటిషన్పై కిమ్మనని ప్రభుత్వం
గవర్నర్కు తాను రాసిన లేఖలు ప్రభుత్వం వద్దకు ఎలా చేరుతున్నాయని ప్రశ్నిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్పై వైసీపీ సర్కారు కిమ్మనడం లేదు. వాస్తవానికి ఎస్ఈసీ చర్యలపై మీడియా ముందుకు వచ్చి వెంటనే స్పందించే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దలు ఈసారి మాత్రం మౌనంగా ఉంటున్నారు. ముఖ్యంగా మంత్రుల వద్దకు తన లేఖలు ఎలా వెళ్లాయంటూ నిమ్మగడ్డ వేసిన ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. గవర్నర్కు ఎస్ఈసీ రాసిన లేఖ అధికారిక రహస్యం కిందకు వస్తుంది. దీన్ని న్యాయస్ధానాలు అడిగితే తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. కానీ ప్రభుత్వ పెద్దలు దీన్ని తీసుకుని అసెంబ్లీతో ప్రివిలేజ్ నోటీసులు ఇప్పించడంతో ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ సైతం ఈ లేఖలపై స్పందించాల్సిన పరిస్ధితి వచ్చింది. కాబట్టి దీనిపై హైకోర్టు నిర్ణయం కీలకంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications