అయ్యన్నపాత్రుడు అరెస్టుపై హైకోర్టు విచారణ: సీఐడీకి కీలక ఆదేశాలు జారీ
అమరావతి: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ అరెస్టుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్ అరెస్టుపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
కేసు డైరీ పరిశీలన తర్వాతే ఉత్తర్వులపై హైకోర్టు
ఈ కేసులో పొందుపరిచిన సెక్షన్లు, ఎన్ఓసీ తదితర అంశాలపై న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే, కేసు డైరీ పరిశీలించిన తర్వాతే మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు డైరీ తమ ముందు ఉంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. నిందితులపై పెట్టిన కేసులు చెల్లుబాటు కావని, ఇదంతా రాజకీయ ఉద్దేశంతోనే చేస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
సీఐడీ వాదనలు.. ఎన్ఓసీపై హైకోర్టు ఏమందంటే?
అయితే, పూర్తి స్థాయిలో విచారణ జరిపామని సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 0.02 సెంట్ల భూమి ఆక్రమించారని తమ వద్ద ఆధారాలున్నాయని, ఎన్ఓసీ కూడా ఫోర్జరీ చేశారని చెప్పారు. భూమి విలువ రూ. 10 వేలకుపైగా ఉందని, అందుకే 41ఏ నోటీసులు ఇవ్వలేదన్నారు. అరెస్టు సమయంలో నిబంధనలు పాటించామని కోర్టుకు తెలిపారు. వానదలు విన్న హైకోర్టు.. కేసు డైరీని పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎన్ఓసీపైనా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.
తెల్లవారుజామునే అయ్యన్నపాత్రుడు, కుమారుడి అరెస్ట్
కాగా, అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిని సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. దీంతో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిని గురువారం తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. వీరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.