పరకామణి చోరీ ఫిర్యాదుదారు హత్యపై హైకోర్టు షాక్..! సర్కార్ కు కీలక ఆదేశాలు..!
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పరకామణిలో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న చోరీ ఘటన తాజాగా తీవ్ర కలకలం రేపుతోంది. అప్పట్లో ఈ చోరీకి పాల్పడిన ఉద్యోగి రవికుమార్ పై కేసు నమోదు చేసినా ఆ తర్వాత లోక్ అదాలత్ లో అప్పటి ప్రభుత్వ పెద్దలు రాజీ చేయించడంతో ఈ వ్యవహారం ముగిసిపోయినట్లు అంతా భావించారు. కానీ తాజాగా కూటమి సర్కార్ దీన్ని తవ్వి తీస్తున్న క్రమంలో ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ కుమార్ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది.
ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ పై ఇావాళ మరోసారి విచారణ జరిగింది. ఇందులో పరకామణి చోరీని గుర్తించి ఫిర్యాదు చేసిన అప్పటి అదనపు విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్య కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి షాకయ్యారు. ఇంత కీలకమైన కేసులో విచారణకు హాజరవుతున్న ఫిర్యాదుదారు, అదీ ప్రభుత్వ అధికారి అనుమానాస్పద స్ధితిలో హత్యకు గురి కావడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫిర్యాదుదారు సతీష్ కుమార్ హత్య నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవి కుమార్ తో పాటు సాక్ష్యులకూ పూర్తిస్ధాయిలో భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది. మరోవైపు తన పర్యవేక్షణలోనే కిందిస్థాయి సీఐడీ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో సీఐడీ డీజీ దాఖలు చేసిన మెమోపైనా స్పందించింది. సీఐడీ డీజీ మెమోను అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు పోలీసులు పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ హత్య కేసును తాడిపత్రికి బదిలీ చేశారు. అలాగే ఆయన ప్రయాణించిన రైల్లో అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. తిరుపతికి ఈ కేసు విచారణకు రెండు గంటల ముందే ఇంటి నుంచి సతీష్ కుమార్ బయలుదేరినట్లు గుర్తించారు. మధ్యలో రైల్వే స్టేషన్ కు వెళ్లేలోపు ఆయన ఎక్కడెక్కడ తిరిగారన్న దానిపై ఫోకస్ పెట్టారు.












Click it and Unblock the Notifications