ఏపీ హైకోర్టు ఆన్ లైన్ విచారణలకు త్వరలో ముగింపు- సెప్టెంబర్లో నేరుగా కార్యకలాపాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడిన తరుణంలో హైకోర్టు కూడా కొంతకాలంగా ఆన్ లైన్ ద్వారా విచారణలు నిర్వహిస్తోంది. ఇందులో పలు సమస్యలు కూడా తప్పడం లేదు. న్యాయవాదుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయితే పలుసందర్భాల్లో ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులను కరోనా సమయంలో రప్పించే వీలు లేకపోవడం, హైకోర్టు ప్రాంగణంలో కరోనా వ్యాప్తి వంటి సమస్యల కారణంగా హైకోర్టు ఆన్లైన్ విచారణలకే మొగ్గు చూపింది.
కానీ ప్రస్తుతం పరిస్దితులు కాస్త కుదుటపడుతుండటం, ఆన్లైన్ విచారణలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 7 సోమవారం నుంచి తిరిగి భౌతికంగా కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు.
ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో చాలా రోజుల తర్వాత హైకోర్టు విచారణలు, ఇతర కార్యకలాపాలు తిరిగి నేరుగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం విజయవాడలో కరోనా నియంత్రణలోకి రావడం, న్యాయమూర్తులు విజయవాడ నుంచే ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న తరుణంలో రోజువారీ విచారణకు హాజరయ్యేందుకు ఎలాంటి సమస్యలు ఉండబోవని భావిస్తున్నారు.