"అమరావతి" పై హైకోర్టులో- రాజధాని ఎక్కడనే అంశం జోలికి వెళ్లం : ఆ రెండూ నివేదికలే..!!
ఏపీలో మూడు రాజధానుల అంశం పైన హైకోర్టులో విచారణ ముగిసింది. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సమయంలో..రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికి వెళ్లబోమని, మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ విషయం జోలికీ వెళ్లబోమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సిఆర్డిఎ, పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ విషయంపై పిటిషన్లలోని ఏ వినతులు మనుగడలో ఉంటాయో వాటికే పరిమితమవుతూ ఉత్తర్వులు ఇస్తామని కూడా స్పష్టం చేసింది.
హైకోర్టులో ముగిసన వాదనలు
అయితే, ప్రభుత్వం మరోసారి బహుళ రాజధాని నిర్ణయం తీసుకుంటే..తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఇవ్వాలని పిటీషనర్లు కోర్టును కోరారు. అంతకు ముందు మూడు రాజధానుల నిర్ణయానికి ముందు చోటు చేసుకున్న అంశాలను పిటీషనర్లు మరోసారి కోర్టుకు నివేదించారు. దక్షిణాఫ్రికా మాదిరిగా మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా కమిటీల నివేదికలున్నాయని హైకోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టం మేరకు రాజధానిగా అమరావతిని నిర్ణయించారని.. రాజధాని విషయంలో చట్టంచేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
ఆ రెండు నివేదికలు ముందస్తుగానే
రాజధాని అమరావతిని ధ్వంసం చేసేందుకు.. ముందస్తుగా సిద్ధంచేసిన నివేదికలను జీఎన్రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ).. ప్రభుత్వానికి సమర్పించాయని రాజధాని రైతులు, ఇతర పిటిషనర్ల తర ఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షనేతగా ఉండగా రాజధానిగా అమరావతి ఏర్పాటును స్వాగతించారని పై న్యాయవాదులు తెలిపారు.
అందుకు సంబంధించిన వీడియోలను కోర్టు ముందుంచామని, వాటిని పరిశీలించాలని కోరారు. పొలిటికల్ మ్యాప్లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిందన్నారు. రాజధానికి భూములు ఇచ్చి న రైతుల హక్కులను జీఎన్రావు కమిటీ, బీసీజే, ఉన్నతస్థాయి కమిటీలు హరిస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని అభ్యర్థించారు.
ప్రభుత్వానికి ఆ అధికారం లేదు
న్యాయరాజధాని పేరుతో హైకోర్టును మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సీఆర్డీఏ చట్టాన్ని సరైన స్పూర్తితో అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అమరావతి మాస్ట ర్ ప్లాన్ను సవరించేందుకు సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 58 అనుమతిస్తోందని తెలిపారు. మూడు రాజధానుల చట్టాలు రద్దు కావడంతో ప్రస్తుత వ్యాజ్యాలు నిరర్ధకం అవుతాయని, వాటిపై విచారణ కొనసాగించడానికి వీల్లేదన్నారు.
శాసనమండలి తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని వినియోగించారని, కొన్ని వర్గాల కోసం చట్టాలు చేయకూడదని పిటీషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలి
శాసన మండలి తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ రాజధానిగా అమరావతి ఉండటంపై తమకు అభ్యంతరం లేదని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్లు చెబుతున్నారన్నారు.
ఆ మాటను అమలు చేయాల్సి వస్తే పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాద ప్రతివాదనలను శుక్రవారం పూర్తి చేయడంతో ఈ వ్యాజ్యాలన్నింటిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.