జగన్కు హైకోర్టులో మరో షాక్- పంచాయతీ పోరుపై నిమ్మగడ్డ నిర్ణయమే ఫైనల్
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘానికీ, ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి తెరదించుతూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం చెబుతున్న కారణాలపై హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నాక క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న చర్యలను హైకోర్టు సమర్ధించింది. వీటికి ప్రభుత్వం సహకారం అందించాలని సూచించింది. దీంతో స్ధానిక ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
నిమ్మగడ్డ మాటే ఫైనల్...
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. కరోనా పూర్తిగా తగ్గకముందే, వ్యాక్సిన్ వచ్చే సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం తప్పుబట్టింది. అదే సమయంలో జోక్యం చేసుకున్న ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే లేని ఇబ్బంది ఏపీకి మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. దీంతో అశ్వనీకుమార్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనే ఫైనల్ అని తేల్చిచెప్పింది.
సర్కారుకు హైకోర్టు ఆదేశాలు ఇవే...
ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న కరోనా పరిస్ధితులను ఎస్ఈసీ నిమ్మగడ్డకు వారు వివరించాలని సూచించింది. సీనియర్ అధికారులతో సంప్రదింపుల తర్వాత ఎన్నికలపై ఈసీ ఆదేశాలు జారీ చేస్తారని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాలతో ఇరుకునపడిన ప్రభుత్వం
కరోనా పరిస్దితులను సాకుగా చూపుతూ నిమ్మగడ్డ పదవిలో ఉండగా..స్ధానిక సంస్ధల ఎన్నికలను అడ్డుకోవాలని భావించిన ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా రెండు నెలల వ్యవధిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏమాత్రం సన్నద్ధంగా లేని పరిస్దితుల్లో హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలను కనీసం మార్చి వరకూ వాయిదా వేయాలని ప్రభుత్వం కోరబోతోంది. మార్చిలో నిమ్మగడ్డ పదవీకాలం ఎలాగో ముగిసిపోనుంది.