విశాఖలో హైకోర్టు, సీమలో బెంచ్!: హైదరాబాదులో...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయవచ్చునని, అక్కడ తగిన వనరులు ఉన్నాయని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. హైకోర్టు బెంచ్ను రాయలసీమలో ఏర్పాటు చేయవచ్చునని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి హైకోర్టును మరికొంతకాలం కొనసాగించడమే మేలని అభిప్రాయపడింది.
హైదరాబాద్ హైకోర్టులో ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ హైకోర్టులు పని చేస్తున్నాయి. మరో నాలుగైదు సంవత్సరాల పాటు ఈ సదుపాయం ఉంటుంది. హైకోర్టు ఏర్పాటుకు వంద నుంచి 140 ఎకరాల స్ధలం అవసరం. విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ కళాశాల ఇప్పటికే ఉంది.
కాని హైకోర్టు ఏర్పాటు విషయంలో భారత రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బెంచి ఏర్పాటు చేయాలంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు విషయమై హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముందుగా తెలియ చేయాల్సి ఉంటుంది. హైకోర్టుతో పాటు పది ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవన్నీ న్యాయపరిధిలోకి వస్తాయి. ఆదాయం పన్ను, అమ్మకం పన్ను, రాష్ట్ర రవాణా అప్పిలేట్స, వినియోగదారుల వివాదాల పరిష్కార న్యాయ సంస్ధ, సహకార, పరిపాలనా ట్రిబ్యునల్స్, జ్యుడీషియల్ అకాడమి, మానవ హక్కుల సంఘం, లోకాయుక్త, అడ్వాన్స్ ఆదాయం పన్ను రూలింగ్, లీగల్ సర్వీసస్ను ఒకే గ్రూపుగా పరిగణించాలి.