జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న: కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం అవసరమా..ఆలోచించండి..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉండగా... ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్ ఆలోచనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఏమిటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్లు ప్రశ్నించారు. ఇక పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన దీక్ష చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో పిటిషన్ను విచారణ చేసింది ధర్మాసనం. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని జగన్ ప్రభుత్వం ప్రకటించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. లక్షల మంది విద్యార్థలు జీవితాలకు సంబంధించి ముడిపడిన విషయం కాబట్టి ప్రభుత్వం మరోసారి పరీక్షల నిర్వహణపై సీరియస్గా ఆలోచించాలని పేర్కొంది. ఈ సందర్భంగా పక్క రాష్ట్రాల ప్రస్తావన తీసుకొచ్చింది ధర్మాసనం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు విద్యార్థుల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేస్తుండగా... ఏపీ ప్రభుత్వం మాత్రం ఎందుకు మొండిగా నిర్వహించాలనుకుంటోందని ప్రశ్నించింది.
ఇక కోవిడ్ విద్యార్థులకు విడిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలపగా...విద్యార్థుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకెలా తెలుస్తుందని కోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో పరీక్షల నిర్వహణపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసింది హైకోర్టు.
ఇదిలా ఉంటే ఏపీలో విద్యార్థుల భవిష్యత్తు వారికొచ్చే మార్కులపైనే ఆధారపడి ఉంటుందని అందుకే పరీక్షలు నిర్వహించాలని తలచినట్లు సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే పరీక్షల కోసం విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ఇటు విద్యార్థుల్లో అటు వారి తల్లిదండ్రుల్లో ఏదో తెలియని ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. విద్యార్థులు పరీక్ష రాసేందుకు వచ్చి కోవిడ్ బారిన పడితే దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. ముందు విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని ఆ తర్వాతే కెరీర్ అని లోకేష్ చెప్పారు.