YS Viveka Murder : సీబీఐపైనే పోలీసు కేసు- నేడు హైకోర్టు విచారణ-జగన్ సర్కార్ ఎటు ?
ఏపీలో మూడేళ్ల క్రితం తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్ని సీబీఐ వేధిస్తోందంటూ పోలీసులు పెట్టిన కేసులపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. తప్పుడు సాక్ష్యాల కోసం నిందితుల్ని సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నారంటూ పోలీసులు గతంలో పెట్టిన కేసుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఇవాళ పూర్తిస్దాయిలో విచారణ జరిపి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

వివేకా కేసులో ట్విస్టులు
సంచలన రీతిలో సొంతిట్లోనే దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి. మధ్యలో పలువురు అధికారుల మార్పులు కూడా జరిగిపోయాయి. అయినా సీబీఐ మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిందితుల్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి జైలుకు కూడా పంపింది. అయితే వీరిలో కొందరు సీబీఐకి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం, వైసీపీ ప్రభుత్వం వాటి ఆధారంగా ఏకంగా సీబీఐపైనే కేసులు పెట్టించడం కూడా జరిగిపోయాయి. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.

హైకోర్టుకెక్కిన సీబీఐ ఏఎస్పీ
వివేకా కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ బెదిరిస్తున్నారని పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు రామ్ సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై గతంలోనే రామ్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో రామ్ సింగ్ పై తదుపరి చర్యల్ని నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా పరిస్ధితిలో మార్పులేకపోవడంతో ఆయన తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ హైకోర్టును ఆశ్రయించారు.

నేడు హైకోర్టు విచారణ
వివేకా హత్య కేసులో నిందితుడిని తప్పుడు సాక్ష్యం కోసం బెదిరించారన్న ఆరోపణలపై సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై ఏపీ పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు అత్యవసర విచారణ జరపాలని సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ నిన్న హైకోర్టును కోరారు. అయితే నిన్న కేసు లిస్ట్ కాకపోవడంతో ఇవాళ విచారణకు హైకోర్టు అంగీకరించింది. దీంతో ఇవాళ హైకోర్టులో మరోసారి ఈ వ్యవహారంపై విచారణ జరగబోతోంది. సీబీఐపై పోలీసు కేసు పెట్టాల్సి రావడం వెనుక ఉన్న కారణాలపై హైకోర్టు సమగ్రంగా విచారణ చేయనుంది.

జగన్ సర్కార్ ఎటు ?
బాబాయ్ వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. గతంలో సీబీఐ దర్యాప్తుపై వైసీపీ నేతలు సైతం ఆరోపణలు చేశారు. అలాగే నిందితుల వాదన ఆధారంగా సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై జగన్ సర్కార్ పోలీసు కేసులు పెట్టించింది. దీంతో ఇప్పుడు హైకోర్టులో జగన్ సర్కార్ నిందితులకు మద్దతుగా నిలబడుతుందా లేక సీబీఐకి అండగా నిలుస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే సీబీఐ ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో వైసీపీ నేతలు దర్యాప్తు సంస్ధపై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. దీంతో ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం చేసే వాదన కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications