ఏపీలో ప్రవేశ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్- ఎంసెట్, ఈసెట్ సహా ఏడు సెట్ల షెడ్యూల్ విడుదల...
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన సెట్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూలై- ఆగస్టు నెలల్లో పరీక్షల నిర్వహణకు వీలుగా ఉన్నత విద్యామండలి సవరించిన షెడ్యూల్ ను ఇవాళ విడుదల చేసింది. జూలై మొదటి వారం కల్లా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. చివరి వారంలో ప్రారంభించే ఆగస్టులో పూర్తి చేసేలా ఏడు సెట్ పరీక్షల తేదీలను ప్రకటించింది.
ఉన్నతవిద్యామండలి ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం... ముందుగా జూలై 24న ఈసెట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 25న ఐసెట్ ఉంటుంది. జూలై 27నుంచి జూలై 31 వరకూ ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకూ పీజీఈసెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆగస్టు 5వ తేదీన బీఈడీ విద్యార్ధుల కోసం ఎడ్ సెట్ నిర్వహిస్తారు. ఆగస్టు 6న లా కోర్సుల్లో ప్రవేశాల కోసం లా సెట్ నిర్వహించనున్నారు. ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకూ పీసెట్ ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.