సోషల్ మీడియాలో అలాంటి పోస్టులపై జగన్ సర్కార్ నిఘా: ప్రత్యేక విభాగం ఏర్పాటు
అమరావతి: సోషల్ మీడియా ద్వారా వేధింపులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అబద్ధాలు, వదంతులను ప్రచారం చేయడం, అవాస్తవ సమాచారాన్ని సర్కులేట్ చేయడంపై నిఘా ఉంచబోతోంది. అలాంటి పోస్టులను అడ్డుకోవడానికి కఠిన చర్యలను తీసుకోబోతోంది.
అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో చేసే పోస్టులపైనా నిఘా ఉంచబోతోంది ఏపీ ప్రభుత్వం. వ్యక్తిత్వ హనానానికి దారి తీసేలా చేసే పోస్టులను కూడా ఉపేక్షించదలచుకోలేదు. దీనికోసం హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఓ విభాగాన్నే ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలతో కూడిన జీఓ వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ- తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో హోం మంత్రిత్వ శాఖపై సమీక్ష నిర్వహించారు. హోం శాఖ మంత్రి తానేటి వనతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన భేటీ ఇది.
ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు వైఎస్ జగన్. సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికోసం పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసుల కోసం ఖచ్చితమైన ప్రోటోకాల్ను ప్రవేశపెట్టాలని సూచించారు.
మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తోన్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్రంగా సమీక్షించాలని, ఇందులో మార్పులు, చేర్పులు చేయాలని హోం శాఖకు సూచించారు. మహిళలకు భద్రతను కల్పించడానికి ఉద్దేశించిన దిశ యాప్ మీద రాష్ట్రవ్యాప్తంగా మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. స్మార్ట్ ఫోన్ను వినియోగించే ప్రతి మహిళ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
దిశ యాప్ను వారు డౌన్లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై మరోసారి పరిశీలన చేయాలని సూచించారు. దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం పంచిపెట్టాలని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని చెప్పారు.
డ్రగ్ పెడ్లర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని జగన్.. హోం మంత్రిత్వ శాఖకు ఆదేశించారు. డ్రగ్ పెడ్లర్స్కు శిక్షలు పెంచేలని సూచించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్ స్టేషన్ ఉండాల్సిన అవసరం ఉందని, త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు. ఈ దిశగా ఆదేశాలను జారీ చేశారు. శాంతియుత పరిస్థితులను నెలకొల్పడంలో రాజీపడే ప్రసక్తే ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications