అవినీతి బయటపడుతుందనే గగ్గోలు, టీడీపీ నేతలపై హోంమంత్రి చిందులు..
టీడీపీ నేతలపై ఏపీ హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయని చెప్పారు. తప్పు చేసినా ఏ ఒక్కరినీ ప్రభుత్వం క్షమించబోదని స్పష్టంచేశారు. అమరావతి భూములు, గనుల తవ్వకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. వీటన్నింటిపై సమగ్రంగా విచారణ జరుగుతోందన్నారు. తమ తప్పులు ఎక్కడ బయటపడుతాయని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు.

తప్పును కప్పిపుచ్చేందుకే..
చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సుచరిత ఫైరయ్యారు. అనారోగ్యంతో వృద్ధులు, వ్యాధితో ఇతరులు చనిపోతే రాజధాని కోసం చనిపోయారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ నేతల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

తప్పుడు ప్రచారం..
మహిళలు స్నానం చేస్తుంటే చిత్రీకరించారని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పి.. మాట తప్పిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. భూములపై రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం కంటే పెన్సన్ ఎక్కువ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

శాంతియుతంగా అయితే ఓకే..
రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమం చేస్తే అభ్యంతరం లేదని స్పష్టతనిచ్చారు. అయితే ఆందోళన శాంతియుతంగా చేయాలని సూచించారు. ఆందోళనల్లో బయటవారు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని సుచరిత ఆరోపించారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రాజధాని తరలింపు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే తప్ప ఈ ప్రాంతంపై కోపం కాదన్నారు. ఆ విషయాన్ని రైతులు పెద్ద మనస్సుతో అర్థం చేసుకోవాలని కోరారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications