మంత్రిని నేనా .. మీరా ?డైరెక్టర్ లను బెదిరించిన అచ్చెన్న..సాక్ష్యాలున్నాయని బాంబు పేల్చిన హోంమంత్రి
ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ డైరెక్టర్ లను బెదిరించారని,అందుకు కావలసిన ఆధారాలున్నాయని సుచరిత బాంబు పేల్చారు.

చంద్రబాబుపై విరుచుకుపడిన హోం మంత్రి సుచరిత
టీడీపీ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని పార్టీ మారమని ఎవరు ఒత్తిడి తీసుకు రాలేదని, అలా చెప్పుకోవడం సిగ్గుచేటు అని చంద్రబాబు నాయుడుపై హోం మంత్రి సుచరిత మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏదోలా వైసీపీ ప్రభుత్వం పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు. బీసీ కార్డు వాడి ఏదో చెయ్యాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఆమె అన్నారు. అచ్చెన్నాయుడు స్వయంగా డైరెక్టర్లను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని ఆమె గట్టిగానే చెప్పారు.

అచ్చెన్నాయుడు విషయంలో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి
మందుల కొనుగోళ్ళు టెండర్లకు పిలవకుండా తాను చెప్పిన వారికే ఇవ్వాలని చెప్పిన మాజీ మంత్రి అధికారులను ఇబ్బంది పెట్టారని, నిబంధనలకు విరుద్ధమని డైరెక్టర్లు చెప్పినప్పటికీ ఆయన వినలేదని హోం మంత్రి పేర్కొన్నారు. ఇక అంతే కాదు మంత్రిని నేనా? మీరా? అంటూ డైరెక్టర్లను బెదిరించి, వారి మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సుచరిత పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు విషయంలో సాక్షాలు అన్నీ దొరికిన తర్వాతే అందరినీ అరెస్ట్ చేశామని పేర్కొన్నారు హోంమంత్రి సుచరిత .

హోం మంత్రి వ్యాఖ్యలతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు
ఈ కేసులో ఇంకొంతమంది పెద్దల ప్రమేయం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక విచారణలో అన్ని బయటపడతాయని సుచరిత అన్నారు. ఇప్పటికే టిడిపి నేతలు వరుసగా టిడిపి మాజీ మంత్రుల అరెస్టులపై నిప్పులు చెరుగుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతుందని నిప్పులు చెరుగుతున్నారు. కానీ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం అవినీతికి ఆధారాలున్నాయి అంటూ వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.
Recommended Video

ఈఎస్ఐ డైరెక్టర్స్ వాంగ్మూలాలే మంత్రి సుచరిత వ్యాఖ్యలకు కారణమా ?
అచ్చెన్నాయుడు వ్యవహారంలో ఆయన నాడు మంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన సిఫారసు లేఖల ఆధారంగా అవినీతి జరిగిందని అంటున్నారు . అలాగే నాడు ఈఎస్ఐ లో పని చేసిన అధికారుల వాంగ్మూలాలను నమోదు చేశారు . కీలకంగా పని చేసిన ఈఎస్ఐ డైరెక్టర్స్ అచ్చెన్నాయుడు ఒత్తిడి మేరకే తాము పని చేశామని ఏసీబీ అధికారులకు చెప్పినట్టు సమాచారం . ఏది ఏమైనా ఈ కుంభకోణంలో మొత్తం 40మంది దాకా ఉన్నట్టు గుర్తించిన అధికారులు విచారణ వేగవంతం చేశారు . ఇక ఆధారాలున్నాయని ఏసీబీ జేడీ కూడా చెప్పారు. తాజాగా హోం మంత్రి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications