ఏపీ, టీ మధ్య మరో కొత్త వివాదం: ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాల స్తంభన
హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డులో కొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డును నిర్వహిస్తున్న ఖాతాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్తంభింప చేశారు. తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ ఇచ్చిన నోటీసు మేరకు ఆయా బ్యాంకులు ఏపీ ఇంటర్ బోర్డు నిర్వహిస్తున్న ఖాతాలను స్తంభింప చేశారు.
ఆయా బ్యాంకుల్లో ఏపీ ఇంటర్ బోర్డుకు సంబంధించిన సుమారు రూ. 240 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ఉన్నత విద్యా మండలి ఖాతాలతో మొదలైన వివాదం, ఆ తర్వాత అన్ని శాఖలకూ పాకి ఇప్పుడు ఇంటర్బోర్డుకూ చేరింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గతేడాది డిసెంబర్లోనే ఇంటర్ బోర్డుని విభజించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో స్ధానికత ఆధారంగా ఉద్యోగులను విభజించుకున్నారు. నిధులను 58:42 ప్రాతిపదికన పంచుకున్నారు. అప్పటి నుంచి బ్యాంకు ఖాతాలను కూడా వేరువేరుగా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది విధులను నిర్వహించారు.
తాజాగా ఉమ్మడి బోర్డులోని నిధులు, భవనాలపై అధికారం తమదేనని, ప్రస్తుత ఏపీ బోర్డుకు ఎలాంటి అధికారం లేదని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఏపీ బోర్డు నిర్వహిస్తున్న బ్యాంకులకు బుధవారం నోటీసులు పంపారు. ఏపీ బోర్డు ఇకపై ప్రత్యేకంగా ఖాతాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఖాతాలను నిలుపుదల చేయాలని, లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో తక్షణమే స్పందించిన బ్యాంకులు ఖాతాలను సీజ్ చేశాయి. గురువారం ఏపీ ఇంటర్ బోర్డు సిబ్బంది ఆయా బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ నిధులను డ్రా చేసుకునేందుకు వెళ్లగా, వారి ఖాతాలను స్తంభింప చేశామని బ్యాంకర్లు చెప్పడంతో అవాక్కయ్యారు.
ఈ విషయాన్ని వారు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.