ఏపీ పోటీ కాదు.. టీకి పరుగులు, మోడీ హెల్ప్:కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మనకు ఎందులోను పోటీ కాదని, గుజరాత్, మహారాష్ట్రలు మనకు పోటీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కేసీఆర్ మండల స్థాయిలో పని చేసే గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారన్నారు. వాటర్ గ్రిడ్ పైన ప్రధానితో చర్చించానన్నారు.
రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి అందరికీ సురక్షిత మంచినీటిని అందించడమే తన లక్ష్యమన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు అడిగితే.. ప్రణాళికలతో వస్తే నిధులు కేటాయిస్తామని మోడీ చెప్పారన్నారు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు. ఇప్పుడు నియంతల రాజ్యం పోయిందన్నారు. అందరం శక్తిసామర్థ్యాలను గుర్తించి తెలంగాణ పునర్నిర్మాణంలో ముందుకు పోదామన్నారు. ప్రజలు మన పైన కోటి ఆశలతో ఉన్నారన్నారు. మంచి పద్ధతిలో ముందుకెళ్దామన్నారు.

ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. వందలో ఒక్క అధికారి తప్పు చేస్తే అందర్నీ నిందించలేమన్నారు. మన రాష్ట్రంలో 8,845 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 25,084 గ్రామాలు ఉన్నాయని, చెప్పారు. అందరికీ తాగునీటిని ఇవ్వాలన్నారు. టెక్నికల్గా అధికారులు సలహాలు ఇవ్వాలన్నారు. గ్రామీణ నీటి శాఖకు ఏం అవసరమున్నాయో చెప్పాలన్నారు. అధికారులు సూచనలివ్వాలన్నారు.
హైదరాబాదులో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో పారిశ్రామికవేత్తలు తెలంగాణకు పరుగెత్తడం మీరు చూస్తారన్నారు. తనతో చాలామంది మాట్లాడుతున్నారని, మనకు ఏపీ పోటీయే కాదని, మన పోటీ గుజరాత్, మహారాష్ట్రతో అన్నారు. తెలంగాణలో నలభై శాతం అర్బనైజేషన్ ఉందన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు.
తాను తన జీవితంలో ఎప్పుడు ఫెయిల్ కాలేదన్నారు. తెలంగాణ తీసుకు వస్తానంటే తనను అందరు వెక్కిరించారని, ఇప్పుడు వచ్చిందన్నారు. తాను తలపెట్టిన పనిలో వందశాతం విజయవంతమవుతానని చెప్పారు. తెలంగాణ తేవడంతో ఈ కీర్తి తనకు కోటి జన్మలకు సరిపోతుందని, ఇక తెలంగాణను ప్రపంచస్థాయిలోకి తీసుకు వెళ్లడమే తన లక్ష్యమన్నారు. తెలంగాణ సాధించిన తనకు ఏ కోరికలు లేవన్నారు. ప్రధాని సర్వే గురించి అడిగారన్నారు.












Click it and Unblock the Notifications