ఏపీలో పెట్రోల్ పోయిస్తున్నారా ? బంకుల్లో చిప్ గమనించారా - తమిళనాడు చిప్లతో మోసాలు..
ఏపీలో పెట్రోల్ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీగా మోసాలు బయటపడుతున్నాయి. చిప్ల సాయంతో పెట్రోల్ బంకుల యజమానులు తక్కువ ఇంధనాన్ని నింపుతూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న వైనం బయటపడింది. తాజాగా జరుగుతున్న తనిఖీలను బట్టి చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి చిప్లను తీసుకొ్చి పెట్రోల్ మీటర్లకు బిగించి యజమానులు మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
పెట్రోల్ బంకుల మోసాలు..
ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేలాది పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో తూనికలు, కొలతలశాఖ అధికారులు తాజాగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. బంకుల్లో పెట్రోల్ ధర ఎంత ఉంది, తీసుకుంటున్న మొత్తానికి తగినంత పెట్రోల్, డీజిల్ వాహనాల్లో నింపుతున్నారా లేదా అనే అంశాలపై వివిధ నగరాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో వారికి దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. వీటి ఆధారంగా పలువురు పెట్రోల్ బంకుల యజమానులను అరెస్ట్ చేసిన అధికారులు బంకులను సీజ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ మోసాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తారా లేక ఎప్పటిలాగే వీరిపై నామమాత్రపు కేసులతో సరిపెడతారా అన్నది తేలాల్సి ఉంది.
మీటర్లలో చిప్లు అమర్చి మోసాలు...
పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు రౌండ్ ఫిగర్ లేదా లీటర్లలో పెట్రోల్ కొట్టించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే తాము చెల్లించిన డబ్బుకు తగినంత ఇంధనం నింపుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకునే తీరిక, ఓపిక వినియోగదారులకు ఉండటం లేదు. ఇంధనం నాణ్యత పరీక్షించుకునేంత సమయం ఎవరికీ ఉండడం లేదు. ఇదే అదనుగా పెట్రోల్ బంకుల యజమానులు మోసాలకు తెరలేపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన చిప్లను మీటర్లలో అమర్చి మీటర్ తిరుగుతున్నట్లే కనిపిస్తూ పెట్రోల్ లేదా డీజిల్ తక్కువగా వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వారికి ఇంధనం ఆదా అవుతుంది. వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది.
తాజాగా తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో ఇలాంటి చిప్ వాడకం దాదాపుగా అన్నిచోట్లా జరుగుతుందని తెలుస్తోంది.
Recommended Video
లీటరుకు 40 ఎంఎల్ మోసం..
ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయంగా కూడా పెట్రోల్ ధర లీటరుకు 90 రూపాయల దగ్గర్లో ఉంది. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకున్నా నెలకు లక్షల రూపాయలు మిగిలే అవకాశముంది. దీంతో పెట్రోల్ బంకుల్లోని మీటర్లలో చిప్లను అమర్చడం ద్వారా పెట్రోల్ బంకుల యజమానులు లీటరు ఇంధనానికి కనిష్టంగా 40 ఎంఎల్ మిగుల్చుకుంటున్నారని తాజా తనిఖీల్లో తేలింది. తాజాగా చిత్తూరులో ఇలా చిప్స్ అమర్చి వినియోగదారులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని వేలూరు నుంచి ఈ చిప్లను తీసుకొచ్చి బిగిస్తున్నట్లు విచారణలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పలు బంకులకు ఇదే విధంగా చిప్లు అమర్చి ఉన్నట్లు చిత్తూరు బంకు యజమాని విచారణలో తెలిపాడు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్రంలో మిగిలిన బంకులపై దాడులు నిర్వహిస్తున్నారు.