జగన్ ప్రభుత్వానికి ఈసీ షాక్: ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్: కలెక్టర్లకు ఆదేశాలు..!
అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ముందు నుండి అనుమానిస్తున్నట్లుగానే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి బ్రేకులు వేసింది. ఈ ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఒకే సారి ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయించింది.
అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ ఉగాది నాడు ఆ కార్యక్రమం ఉంటుందా..లేక వాయిదా వేస్తారా అనే సందేహం మొదలైంది. అయితే, ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమం అయినా తాత్కాలికంగా నిలిపివేయాల్సిందే నని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో..ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగిసిన తరువాత అమలు చేయాలని సూచించింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటంతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే కర్యక్రమాలు నిర్వహించటానికి వీళ్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకటించిన సమయం నుండి పూర్తిగా ఫలితాలు వెల్లడయ్యే వరకూ అంటే ఈ నెల 29వ తేదీ అర్ద్రరాత్రి వరకూ కోడ్ అమల్లో ఉంటుంది.
అయితే, ప్రభుత్వం సరిగ్గా ఈ సమయంలోనే అంటే ఈ నెల 25న ఉగాది నాడు ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది. అందు కోసం ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరింది. ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కి అన్ని ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా ఏపీలోని 25 లక్షల మంది పేదలకు జగన్ సర్కారు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తారు. దీనిలో భాగంగా.. 14,097 వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలోనే ఎన్నికల కమిషనర్ దీని పైన వివరణ ఇచ్చారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమం అయినా తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. అయితే, ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విషయంలో మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించినా..జిల్లా కలెక్టర్లు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటారని..కోడ్ పరిధిలో నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
కోడ్ ఉల్లంఘన కిందకు వస్తే వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని ఆయన మాటల్లో స్పష్టమైంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు..అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టంతో ఇప్పుడు దీని పైన మరింత స్పష్టత ఇచ్చారు. అన్ని జిల్లాల్లోనూ ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘం నుండి కలెక్టర్లకు అదేశాలు వెళ్లాయి. దీంతో..ఎన్నికలు ముగిసిన తరువాత ప్రభుత్వం మరో ముమూర్తాన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.