సినిమా టికెట్ల ధరలు తగ్గించాల్సిందే-ఏపీ లోకాయుక్త వ్యాఖ్యలు-సర్కార్ కు మద్దతు
ఏపీలో సినిమా టికెట్ల వివాదం అంతకంతకూ ముదురుతోంది. సినిమా టికెట్ల ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడిని టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో హీరోలు నాని, సిద్ధార్ధ వంటి వారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి దీనిపై స్పందించారు.
సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలు నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. ఇష్టారీతిన టికెట్లు పెంచుకునే అధికారం ఎవరికీ ఉండకూడదన్నారు. కోర్టులు జీవో 35ను కొట్టేసినా.. ప్రజా ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటాయని లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. థియేటర్లకు వెళ్లేది దిగువ తరగతి వాళ్లేనని, ఖచ్చితంగా టికెట్ ధరలు నియంత్రణలో ఉండాలని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. దీంతో లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అలాగే సినిమాల బడ్జెట్లపైనా లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసం భారీ బడ్జెట్ సినిమాలని ఆయన ప్రశ్నించారు. సినిమా ప్రొడక్షన్ ఖర్చు నియంత్రించుకోవాలని టాలీవుడ్ కు ఆయన సూచించారు. అసలే సినిమా హీరోల రెమ్యునరేషన్, సినిమా నిర్మాణ ఖర్చుపై వైసీపీ సర్కార్ మండిపడుతున్న నేపథ్యంలో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యలు మరింత కాకరేపేలా ఉన్నాయి. ప్రభుత్వానికి మద్దతుగా టాలీవుడ్ కు వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఆసక్తిచర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా మారిన ఈ వార్ లో లోకాయుక్త ఎంట్రీతో వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ కూడా సాగుతోంది.