దసరా వేళ తుపాను ముప్పు - ఉత్తర కోస్తాలో తీరం దాటే ఛాన్స్ : నేటి నుంచి వర్షాలు..!!
దసరా పండుగ వేళ ఏపీ జిల్లాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. రేపు (10వ తేదీ) ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వ వర్గాలకు సమాచారం ఇచ్చింది. అల్పపీడనం దసరా నాటికి ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ది క్రమంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర వైపు పయనిస్తూ 12వ తేదీన మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.
పండుగ సమయంలో తుపాను హెచ్చరికలు
ఆపై మరింత బలపడి ఈ నెల 13, 14 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది తుపానుగా మారితే పూరీ నుంచి మచిలీపట్నం మధ్య ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఈ నెల 15న తీరం దాటే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి.
కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు
రాగల రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్లోని కొన్ని భాగాల నుంచి తిరోగమించనున్నాయని ఐఎండీ వెల్లడించింది. వీటి ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పెనుమూరు మండలంలో 176.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మరో ఏడు మండలాల్లో 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది.
అల్పపీడన తుపానుగా మరితే..
మరోవైపు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో శుక్రవారం 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నెల తుపానుల సీజన్. 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడుతూ దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుంది. తుపానుగా మరే అవకాశాలను పరిశీలిస్తున్నాం. దీనిపై 10 తర్వాత స్పష్టత వస్తుంది' అని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. 10న ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే
ఇది తుపానుగా మారినా, వాయుగుండానికే పరిమితమైనా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం సైతం వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం అవుతోంది. జిల్లాల అధికారులకు సూచనలు చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే నిర్దేశించింది.