పేరుకు వరద బాధితుల పరామర్శ; అక్కడ భార్య పేరుతో చంద్రబాబు రాజకీయం: మంత్రి ఆదిమూలపు సురేష్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు వరద ముంపుకు గురవడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు వరద బాధితుల కోసం రంగంలోకి దిగాయి. ఇప్పటికే ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందిస్తుండగా, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పర్యటిస్తూ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తూ వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. బిజెపి కూడా వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి, ఆ విరాళాలను వరద బాధితులకు అందించాలని నిర్ణయించింది.

విపత్తుల సమయంలో రాజకీయాలా?
ఇదిలా ఉంటే ఏపీలో వరదలకు మానవ తప్పిదాలే కారణమని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. వాటర్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం వల్ల, సరైన సమయంలో ప్రాజెక్టుల గేట్లు తెరవకపోవడం వల్ల గ్రామాలు ముంపునకు గురయ్యాయని, అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించిందని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విపత్తు సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా ప్రజలకు సేవ చేయాలని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సహాయక చర్యలపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు.

భార్య పేరుతో చంద్రబాబు రాజకీయం
వరద బాధితుల పరామర్శ పేరుతో వెళ్లిన చంద్రబాబు, అక్కడ తన భార్య పేరుతో రాజకీయం చేస్తున్నాడంటూ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఇతర ప్రాంతాల నుండి జనాలను తీసుకొచ్చి చంద్రబాబు పర్యటన పేరుతో హంగామా చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా రాజకీయాలు చేయటం మంచిది కాదని హితవు పలికారు. సాధ్యమైతే ప్రజలకు ప్రతిపక్ష పార్టీగా చేతనైన సహాయం చేయాలని, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తే స్వాగతిస్తామని, విమర్శలకు దిగితే సహించబోమని తేల్చిచెప్పారు.

లోటుపాట్లు చెప్పాలి కానీ ఇది పద్ధతి కాదు
ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేసిందో లేదో, ఒకసారి వారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుందని చంద్రబాబుకు హితవు పలికారు. రాత్రికిరాత్రే ఒక్కసారిగా వరద పోటెత్తడంతో 22 మంది మరణించారని, మరో 20 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునే విధంగా ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలి కానీ, అనవసరపు విమర్శలు చేయకూడదంటూ మండిపడ్డారు. విపత్తుల సమయంలో ఇంత త్వరగా నష్టపరిహారం గతంలో ఎప్పుడైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించిన ఆదిమూలపు సురేష్ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో ఆదిమూలపు సురేష్
ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు కావలసిన సరుకులు, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. వరద నీటిలో మునిగి పోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వరద ముంపుకు గురైన కాలనీల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అన్నమయ్య ప్రాజెక్టు ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు .

ప్రకృతి విపత్తుల సమయంలో అంతా సహకరించాలి
వరద ప్రాంతాలలో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి అని చెప్పిన ఆయన పునరావాస కేంద్రాల ఏర్పాటును 100% పూర్తిచేశామని, భారీ వరదలతో చనిపోయిన వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి కానీ, ప్రతి దానిపై అనవసర రాద్ధాంతం చేయకూడదని హితవు పలికారు. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications