సాగర్ లో నీళ్లు అందుకే వాడుకున్నాం ! జగన్ సర్కార్ క్లారిటీ..!
నిన్న తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఇరు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ పై ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏపీ నుంచి పోలీసులు ఒక్కసారిగా నాగార్జున సాగర్ డ్యామ్ పైకి భారీగా ప్రవేశించి 13వ నంబర్ గేట్ల వద్ద బ్యారికేడ్లు వేశారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖ అధికారులు పోలీసుల సాయంతో సాగర్ నుంచి 2 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. దీన్ని అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు.
దీంతో ఇవాళ తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులపై కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ నీటీ పారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ ఈ వ్యవహారంపై స్పందించారు. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఇంత హడావిడిగా తెలంగాణ అధికారులతో బాహాబాహీకి దిగి మరీ నీటిని విడుదల చేయాల్సిన పరిస్దితి ఎందుకు వచ్చిందన్న దానిపై ఆన వివరణ ఇచ్చారు.

మేం మా దగ్గర ఉన్న నీటిని మాత్రమే తీసుకున్నామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ వెల్లడించారు. 66 శాతం కృష్ణా నీరు ఏపీకి చెందుతుందని గమనించాలని ఆయన తెలిపారు. నాగార్జున సాగర్ డ్యామ్ అంశంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తాము ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదన్నారు.కృష్ణా నీళ్లలో 66 శాతం ఆంధ్రప్రదేశ్కు, 34 శాతం తెలంగాణకు గతంలోనే కేటాయించారని గుర్తుచేశారు.
తమకు చెందని ఒక్క నీటి చుక్క కూడా వాడుకోలేదని అంబటి రాంబాబు తెలిపారు. తాము తమ స్వంత భూభాగంలో తమ కెనాల్ ను తెరవడానికి ప్రయత్నించామన్నారు. ఈ నీరు న్యాయంగా తమదేనన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ రైతులకు, ప్రజల అవసరాలనిమిత్తం తమ భూభాగంలో ఉన్న 66 శాతం నీటినే ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిన విషయం అందరూ గమనించాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు.












Click it and Unblock the Notifications