పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఏపీలో రచ్చ- కొత్త గొడవలొద్దు-కేంద్రాన్నే అడగండి- మంత్రి అంబటి
గోదావరి వరదల వ్యవహారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు రాజేస్తోంది. వరదలతో ఇప్పటికే భద్రాచలంతో పాటు పోలవరంలో విలీనమైన మండలాలు కూడా మునిగిపోతున్న నేపథ్యంలో పువ్వాడ అజయ్ ఆ మండలాల్ని తిరిగి తమకు ఇచ్చేయాలంటూ కేంద్రాన్ని కోరడం ఏపీలో చిచ్చురేపింది. దీనిపై ఏపీ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో జలవనరుల మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై మండిపడ్డారు.
రెండుతెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని,ఇప్పుడు కొత్తగా ఎలాంటి వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం రాములోరి ఆలయానికి ముప్పు పొంచి ఉందన్న తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు సరికాదన్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ప్రతీ ఏటా ఏపీ, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మునగడం సాధారణమేనన్నారు. మనిద్దరం తెలుగువాళ్లమేనని, రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కేంద్రమే ఇచ్చిందని, 7 మండలాలకు పోలవరం వల్ల ఇబ్బంది ఉంటుందనే వాటిని ఏపీలో కలిపారన్నారు. భద్రాచలంలో వరదలు వస్తే దానికి పోలవరం ఎలా కారణమవుతందని అంబటి ప్రశ్నించారు. మీరు పోలవరం విలీన మండలాలు అడిగితే మేం భద్రాచలం అడుగుతాం ఇస్తారా అని ఆయన అడిగారు. ఆ ఐదు గ్రామాలు కావాలంటే కేంద్రాన్నే అడగాలన్నారు. పోలవరం ఎత్తుకు అనుమతి ఇచ్చింది కూడా కేంద్రమేనన్నారు. వరదలపై గోదావరి బోర్డును సంప్రదించాలని పువ్వాడ అజయ్ కు అంబటి సూచించారు.












Click it and Unblock the Notifications