బేసిగ్గా మేం జగన్ భక్తులం..ఆయన మూడోకన్ను తెరిస్తే బాబు భస్మం.. సీఏఏపై టీడీపీ వైఖరేంటి?:మంత్రి అనిల్
ఢిల్లీలో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత 'మోదీ భక్త్' అనే మాట తరచూ వింటున్నాం. గతంలో మన పొరుగురాష్ట్రం తమిళనాడులోనైతే ఇష్టమైన నేతలకు గుడులు కట్టడం.. 'నీవే అమ్మ'వంటూ సాష్టాంగ ప్రమాణాలు చేయడమూ చూశాం. తెలుగురాష్ట్రాల్లోనూ నేతల పట్ల జనం ఆరదాభిమానాలకు కొదువలేదు. అయితే అది భక్తేనని అనుచరులు ఒప్పుకున్న సందర్భాలు మాత్రం దాదాపు లేవు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తాను ముమ్మాటికీ జగన్ భక్తుడినని ఘంటాపథంగా చెబుతుననారు. శుక్రవారం కర్నూలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. సీఎ జగన్, చంద్రబాబులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాతే మంత్రి పదవి..
రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందునుంచే తాను వైస్ జగన్ భక్తుడినని మంత్రి అనిల్ చెప్పుకున్నారు. అంతటితో ఆగకుండా, సీఎంను శివుడితో, ప్రతిపక్ష నేతను రాక్షసుడితో పోల్చారు. ‘‘మంత్రి పదవి రాకముందు నుంచే మేం జగన్ భక్తులం. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. సీఎం జగన్ గనుక మూడో కన్ను తెరిస్తే ఆ దెబ్బకి చంద్రబాబు నాయుడు మాడిమసైపోయి భస్మమైపోతాడు''అని అనిల్ అన్నారు.
Recommended Video
అభిమానంతో ఓట్లు..
ప్రజల కోసం సీఎం జగన్ చేస్తున్న ప్రతి మంచిపనికి చంద్రబాబు శిఖండిలా అడ్డుతగులుతున్నారని మంత్రి అనిల్ విమర్శించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు అక్రమంగా లాగేసుకున్నారని, టీడీపీకి ఇవాళ కొద్దిగైనా ఓట్లు పడుతున్నాయంటే అది ఎన్టీఆర్ పై అభిమానం వల్లేగానీ చంద్రబాబు పనుల్ని జనం మెచ్చుకున్నట్లు కాదన్నారు.
కొత్త పార్టీతో రండి..
చంద్రబాబుకు ప్రజల్లో కొంచెం కూడా ఆదరణ లేదన్న మంత్రి.. ఎన్టీఆర్ అభిమానులు ఓట్లేసే టీడీపీ నుంచి కాకుండా.. కొత్త పార్టీతో జనం ముందుకొస్తే చంద్రబాబు బండారం తేలిపోతుందన్నారు. ‘‘ఎన్టీఆర్ పై అభిమానంతో జనం ఇప్పటిదాకా టీడీపీకి ఓట్లేస్తున్నారు. తన సత్తా నిరూపించుకోడానికి చంద్రబాబు సొంతగా పార్టీ పెట్టి గెలవగలరా?''అని అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరారు.
సీఏఏపై బాబు మాట్లాడరేం?
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ఏపీలో అమలు చేయబోమని ఇదివరకే తీర్మానం చేసిన విషయాన్ని మంత్రి అనిల్ గుర్తుచేశారు. మైనార్టీలకు జగన్ సర్కారు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై మౌనంగ ఉండిపోవడమేంటని మంత్రి ప్రశ్నించారు. సీఏఏ, ఎన్ఆర్సీపై టీడీపీ వైఖరేంటో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.