క్యారెక్టర్లెస్ ఫెలో! రేవంత్ రెడ్డిది తెలుగు కాంగ్రెస్ పార్టీ: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఏకిపారేశారు
హైదరాబాద్/అమరావతి: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అతనో క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ దుయ్యబట్టారు. ఎవరో ఏదో చెబితే.. రేవంత్ రెడ్డి చేస్తాడు.. అంటూ ఏపీ విద్యుత్ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఏం చెబితే అదే..
అమరావతి రాజధానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ కాదని.. తెలుగు కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే రేవంత్ రెడ్డి చెబుతారని అన్నారు. రేవంత్ రెడ్డికి ఓ పార్టీ అంటూ ఏమీ లేదన్నారు.
రేవంత్ రెడ్డికి అమరావతి గురించి ఎందుకు?
రేవంత్ రెడ్డికి అమరావతి గురించి ఎందుకని ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి.. అక్కడ రాజధాని పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బాలినేని శ్రీనివాస్ తెలిపారు. ఓ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీ అధినేత ఇష్టమంటాడు.. ఆయనకో పార్టీ లేదు.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు ఇష్టమంటాడు.. అదీ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అంటూ విరుచుకుపడ్డారు మంత్రి బాలినేని.
కాంగ్రెస్లో ఉంటూ చంద్రబాబు అంటే ఇష్టమన్న రేవంత్
విలువలతో కూడిన రాజకీయ నాయకులను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. కాగా, ఏపీ రాజధాని అమరావతి గందరగోళంగా మారడం తెలంగాణవాదిగా సంతోషం కలిగిస్తోందని, కానీ, భారత పౌరుడిగా బాధగా ఉందని రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, తనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేనితోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవంత్ రెడ్డిని ప్రజలు ఎలా నమ్ముతారు?
మరోవైపు రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ను తిట్టడం ద్వారా శునకానందం పొంది సభను ముగించారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని అన్నారు. చంద్రబాబు భిక్షతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు. ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకునే రేవంత్ రెడ్డి, రోజుకో మాట, పూటకో పార్టీ మార్చుతుంటాడని విమర్శించారు. ప్రజలు ఆయనను ఏవిధంగా నమ్మాలని ప్రశ్నించారు. 1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీ బిడ్డలను వందల మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. ఆ నాడు ఇందిరాగాంధీ హయాంలో ఈ ఘాతుకం జరిగిందని తెలిపారు. అలాంటిది అదే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయడం చూస్తుంటే గుండెలు మండాయని అన్నారు. ఆనాడు గిరిజనులను చంపి ఇవాళ స్మారకం కడతారా? అని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటూ.. చంద్రబాబుకు ఎంతో సన్నిహితుడైన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.