ఛలో విజయవాడకు ఉద్యోగులు రెడీ-కాసేపట్లో సీపీఎస్ పై మంత్రి బొత్స కీలక చర్చలు..
అమరావతి : ఏపీలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగసంఘాలు ఇప్పటికే ఈ నెల 11న ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ నెల1న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని 11కు వాయిదా వేసుకున్న ఉద్యోగసంఘాలు.. దీన్ని సక్సెస్ చేసేందుకు జిల్లాల్లో కమిటీలు వేసుకుని కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని మరోమారు ఇవాళ చర్చలకు ఆహ్వానించింది.
సీపీఎస్ రద్దుపై ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి ఇవాళ పిలుపు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్యూఎస్ సంఘాలకు పిలుపు వెళ్లింది. సీపీఎస్ రద్దుపై వెనక్కి తగ్గేందుకు సిద్ధమని ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఉద్యోగసంఘాలు మాత్రం ఓపీఎస్ తప్ప మరోవిధానానికి అంగీకరించేది లేదని చెప్తున్నాయి.

గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో సీపీఎస్ రద్దుపై అని పిలిచి వెళ్లేసరికి జీపీఎస్ పై చర్చలు పెట్టడంపై ఉద్యోగులు అసహనంగా ఉన్నారు. ఈసారి మాత్రం సీపీఎస్ రద్దు చేస్తామంటేనే చర్చలకు వస్తామని ఉద్యోగులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వబోతోందనేది కీలకంగా మారింది. నిన్న సీపీఎస్ పై ఉపాధ్యాయ దినోత్సవ ప్రసంగంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కోసం లక్షలాది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ చర్చలు విఫలమైతే 11న ఛలో విజయవాడ యథాతథంగా నిర్వహించాలని వారు పట్టుదలగా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అరెస్టులు, బైండోవర్లతో వారిని అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications