జగన్ రాయలసీమ ద్రోహి: మంత్రి దేవినేని, చేతగాకే జగన్పై వల్లే నిందలు: భూమన
గుంటూరు: ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం నీటిని విడుదల చేసింది.
ఈ నీటిని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి దేవినేని విడుదల చేశారు. దీంతో సాగునీటికే కాక తాగునీటికీ అష్టకష్టాలు పడుతున్న అనంతపురం జిల్లా వాసుల వెతలు తీరినట్టే. ఈ సందర్భంలో మంత్రి దేవినేని మాట్లాడుతూ జగన్ రాయలసీమ ద్రోహి అని అందుకే పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాడని విమర్శించారు.
ఈ జలాశయం ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేఈ తెలిపారు. హంద్రీనీవా నీటితో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున బీడు భూములు సాగు భూములుగా మారనున్నాయి.
చేతగాకే జగన్పై నిందలు: భూమన కరుణాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సంపాదించేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్న వైయస్ జగన్పై చేతగాకే నిందలు వేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన వైయస్ జగన్ దీక్షా స్థలి నుంచి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడికి ఓటుకు నోటు కేసు భయం పట్టుకుందని అన్నారు.
ఆ భయం వల్లనే చంద్రబాబు కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళుతోన్న చంద్రబాబు ప్రత్యేకహదాపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై టీడీపీ మంత్రులు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలకు దమ్ముంటే కేంద్రంలో మంత్రి పదవులు వదిలి ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడాలని అన్నారు.