ఆ టీడీపీ మంత్రి బొత్స కాళ్లపై పడ్డారా ? వాస్తవం ఏంటి ?
ఏపీలో గత కొన్ని రోజులుగా ఓ ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. చంద్రబాబు కేబినెట్ లో యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా ఓ సందర్భంలో వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత కూడా అయిన బొత్స సత్యనారాయణ పాదాలపై పడ్డారనేది ఆ ప్రచారం సారాంశం. దీంతో ఈ వ్యవహారం ఆయన సొంత పార్టీ టీడీపీతో పాటు వైసీపీ, ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇవాళ స్వయంగా మంత్రే వివరణ ఇచ్చారు.
నవంబర్ 11న ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా అసెంబ్లీకి వెళ్తుండగా ఎదురుపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను చూడగానే సంస్కారంతో నమస్కారం పెట్టినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారని అనుకోలేదన్నారు. అక్కడ కూర్చొని ఉన్న ఇతర నాయకులు లేచి పలకరించారని, అది సంస్కారంతో పలకరించడం జరిగిందేగాని అక్కడ ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదన్నారు.
ప్రతిపక్ష నేతల కాళ్లకు దండాలు పెట్టాల్సిన అవసరం తమకేం వచ్చిందని ప్రశ్నించారు.

ఫేక్ న్యూస్ ని జనాల్లోకి పంపుతున్నారని, సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ని వక్రీకరించి పెద్ద ఎత్తున దాన్ని సంచలనం చేస్తున్నారని మంత్రి కొండపల్లి విమర్శించారు. యువనాయకత్వాన్ని, జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాయకత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం ఉంది. కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం అంటూ బొత్స కుటుంబంపై పరోక్ష విమర్శలు చేశారు.
గత 20 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో కుటుంబ పరిపాలన సాగుతూ వస్తోందని మంత్రి తెలిపారు. ఒక్కో నియోజకవర్గాన్ని బొత్స కుటుంబ సభ్యులే పోటీ చేయడంగాని, లేక వారి తాలూక మనుషులు పోటీ చేయడంగానీ జరుగుతూ వచ్చిందన్నారు. పూర్తిస్థాయిలో భూదందాలు, లిక్కర్ దందాలు చేస్తూ వచ్చారని, విజయనగరం జిల్లాలో ఇవాళ ప్రజానీకమంతా ఏకమై వాళ్ల వారిని ఎవరినీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా, ఒకవేళ చేసినా గెలవనీయకుండా చేశారన్నారు. వైసీపీ దీన్ని జీర్ణించుకోలేకపోతోందన్నారు.












Click it and Unblock the Notifications