తెలంగాణ విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టే యత్నం: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
చిత్తూరు: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేనిఫెస్టోలో హామీలు అమలు చేయని చంద్రబాబు అని, ఓటుకు నోటు కేసులో దొరికిన నేత అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి పెద్దిరెడ్డి తిరుపతిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గతంలో చంద్రబాబు తన అనుచరులకు దోచిపెట్టారని ఆరోపించారు. టీడీపీ సర్కారు ఇసుక పేరుతో దోచుకుందన్నారు. తమ ప్రభుత్వం ఇసుక కాంట్రాక్టు, మైనింగ్ విషయంలోనూ పాదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు.
మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అయితే.. సీఎం వైఎస్ జగన్ 98 శాతానికిపైగా హామీలు అమలు చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. సీఎం జగన్ పారదర్శక పాలన అందిస్తుంటే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నిత్యం ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీ సర్కారుకు సంబంధం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ కుటుంబీకులకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, తెలంగాణ సర్కారుపైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి రూ. 6వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలు ఎగ్గొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తుందని పెద్దిరెడ్డి ఆరోపించారు. అంతేగాక, ఏపీ రూ. 1700 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు.
సెప్టెంబర్ 22న సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు. కుప్పంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడో విడత చేయూత పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.