దేశ పరువును దిగజార్చి.. ఏపీలో మత విద్వేషాలకు కుట్ర.. బీజేపీపై పేర్ని నాని ఫైర్
సీఎం జగన్ అసమర్థతతో ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కానసాగుతుందన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. రాజకీయ అవసరాలకు కోసం బీజేపీ ఎంతకైనా దిగజరుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తమ ప్రభుత్వంపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కేంద్ర మంత్రికి తగదని పేర్నినాని మండిపడ్డారు.

బీజేపీది దిగజారుడు రాజకీయం
ప్రధాని మోదీ పాలన రాష్ట్రానికి ఏం చేశారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజకీయ అవసరాలకోసం బీజేపీ ఏస్థాయికైనా దిగజారుతుందన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం తగునా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో దేశ వ్యతిరేక శక్తుల్ని పుట్టిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలపై నాని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి పూనుకున్నారా?
ఏపీని బీజేపీ ఏం చేయదలుచుకుందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి పూనుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విదేశాల్లో దేశ పరువును నిలబెట్టాల్సి బీజేపీ ఇంత దిగజారుడుతనంగా ప్రవవర్తించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఏపీలో దేశానికి నష్టం వాటిల్లే తప్పులు జరుగుతుంటే కేంద్రం ఏమి చేస్తుంది.. ఐబీ, రా.. ఏమి చేస్తున్నాయని మోదీ ప్రభుత్వంపై పేర్నినాని విరుచుపడ్డారు.

పీఆర్సీపై చంద్రబాబు కొంగజపం..
సంక్రాంతి సంబరాలపై టీడీపీ అధినేత చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నానిపై చంద్రబాబు విపరీతమైన ద్వేషం పెంచుకున్నారని దుయ్యబట్టారు. కాల్ మనీ, చీటింగ్ కేసుల్లో ఉన్నవారితో నిజనిర్థారణ కమిటీ వేస్తారా అని ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో చంద్రబాబు కొంగజపం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల్ని మానసింగా వేధించి, అవమానించిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. సీఎం జగన్ ఉద్యోగులు పట్ల సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలకు ఎప్పుడు వచ్చినా చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు పేర్ని నాని.

రాష్ట్రంలో అరాచకపాలన .. కేంద్రమంత్రి విమర్శలు
ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన.. కేంద్ర మంత్రి మురళీధరన్ కడప సెంట్రల్ జైల్ లో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇస్లామిక్ పండమెంటల్ కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు చేశారు. ఆత్మకూరులో అల్లర్లకు సీఎం బాధ్యత వహించాలన్నారు. జగన్ అసమర్థత వల్లే రాష్ట్రంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని విరుచుపడ్డారు.












Click it and Unblock the Notifications