చంద్రబాబు విఫలం?: డైలాగులు బాగా చెప్తున్నారు, ఆచరణ శూన్యం
అమరావతి: గత వారం రోజులుగా ఏపీలో ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా వినిపిస్తున్న మాట ఏపీకి 'ప్రత్యేకహోదా'. ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వంలోని మంత్రులు తేల్చి చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని ఇక్కడి నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం సరైన ప్రయత్నం చేయడం లేదనే ప్రజలు భావిస్తున్నారు. అమరావతి ప్రజా రాజధాని, రాష్ట్రం రెండంకెల అభివృద్ధి, పరిశ్రమల వెల్లువ లాంటి మాటలు ద్వారా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారాు.
అయితే ఏపీకి ప్రత్యేకహోదా రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యమవుతుండటంతో తప్పంతా చంద్రబాబుదే అని ప్రజలు సైతం భావిస్తుండటం విశేషం. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీకి చెందిన నేతలు, మంత్రులు పెద్ద పెద్ద డైలాగులే చెప్తున్నారు.
ఇటీవలే రాజ్యసభలో కేంద్ర మంత్రి హెచ్బీ చౌధురి వ్యాఖ్యలు రాష్ట్రంలో వేడిని పుట్టించాయి. ప్రతిపక్షాలు అన్నీ కలిసి, టీడీపీ వైఫల్యాన్ని మరింతగా ఎండగడుతున్న సమయంలో టీడీపీ మంత్రులు, నేతలు సైతం తామేమి తక్కువ తినలేదన్నట్లుగా హోదా కోసం పోరాడుతాం, మోడీ వద్దకు వెళుతాం అంటూ పెద్ద మాటలు చెబుతున్నారు.
తాజాగా గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. తమకు మిత్రపక్షం అయినంత మాత్రాన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలిపెట్టే సమస్యే లేదని, చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అనడం ఆశ్చర్యంగా ఉంది.
అంతేకాదు విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాల్సిందే అని ఆయన అంటున్నారు. టీడీపీ నేతలు మీడియా చిట్ చాట్లో పాల్గొన్న సమయంలో కూడా ఏపీకి ప్రత్యేకహోదా కోరుతా ప్రతిపక్షం ఆందోళనలు చేయాల్సింది గల్లీ కాదు, ఢిల్లీ అంటూ పెద్ద పెద్ద డైలాగులే చెబుతున్నారు.
అయితే ఏపీకి ప్రత్యేకహోదా సాధన విషయంలో టీడీపీ నేతలు డైలాగులు బాగానే చెబుతున్నారు గానీ దానిని సాధంచే విధానంలో విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
'విభజన చట్టంలోని అంశాలు అన్నీ' అనే మెలిక ద్వారా.. 'ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ వంచించింది' అనే మాయమాటలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో ఒక నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు సాగితే బాగుంటుంది.