ఏపీ మంత్రి సత్యకుమార్కు తప్పిన ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని గుమ్మలూరు సెంటర్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 పడకల ఓపీ భవనం, డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ఉండి శాసనసభ్యులు, శాసనసభ ఉప సభాధిపతి రఘురామ కృష్ణంరాజుతో కలసి ప్రారంభించారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన దాత డా. సత్యనారాయణ రాజుని అభినందించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు మంత్రి సత్యకుమార్. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 55 డయాలసిస్
కేంద్రాలు, 650 మెషీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

బంగారుపాళ్యం, పాలకొల్లు, వింజమూరు, పొదలకూరు, ధర్మవరంలో డయాలసిస్ కేంద్రాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. మరికొన్నింటిని త్వరలో అందుబాటులోకి తేనున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా సంభవించే వ్యాధుల వల్ల మూత్రపిండాలు ఎక్కువ ప్రమాదం ఎదుర్కొంటున్నాయన్నారు.
కిడ్నీలకు ప్రమాదం తేవడంలో మధుమేహం, హై బీపీ, మద్యపానం ముందువరుసలో ఉన్నాయన్నారు. డయాలసిస్ ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించవచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డయాలసిస్ సెంటర్ ను వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ కోరారు.
ప్రజలు, జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు భీమవరం ఏరియా ఆస్పత్రికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ ను మంజూరు చేస్తున్నాం. రూ.24 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తాం. ఈ బ్లాకులో అన్ని రకాల మౌలిక వసతులకు రూ.17కోట్లు, అత్యాధునిక డయాగ్నోసిస్ ఎక్విప్మెంట్ కోసం రూ.7కోట్లు కేటాయించి ఈ బ్లాక్ ను అందుబాటులోకి తెస్తాం. త్వరలోనే ఈ బ్లాకు ఏర్పాటుకు భూమిపూజ చేస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణకు అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
పల్లె పండగలో మంత్రి సత్యకుమార్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో 'పల్లె పండుగ' అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సత్యకుమార్. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును, పశుశాలలను నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్నితో కలసి ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామసభలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల సమగ్రాభివృద్దే లక్ష్యంగా 'పల్లె పండుగ' కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు అన్ని పంచాయతీల్లోనూ గ్రామ సభలు నిర్వహించి మౌలిక వసతులు, ఆర్థికాభివృద్ధి పథకాలపై ప్రజల వినతులు స్వీకరించింది. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించింది. సీసీ రోడ్లు, పశుశాలలు, గొర్రెలు/మేకల షెడ్లు, దోబీ ఘాట్ల నిర్మాణం ప్రారంభించిందని మంత్రి సత్యకుమార్ వివరించారు.

పల్లె పండుగ'లో ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన వినతుల మేరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.141.75 కోట్ల విలువైన 16,773 పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 523 పశువుల కొట్టాల నిర్మాణానికి రూ.12.10 కోట్లు కేటాయించింది. 375 పశువుల కొట్టాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అలాగే రూ.82.55 కోట్ల విలువైన 532 సీసీ రోడ్లకు గాను ఇప్పటికే 375 పూర్తయ్యాయి. మిగిలినవి త్వరలోనే అందుబాటులోకి తేనుంది. గ్రామాల అభివృద్ధిపై ఇది మా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. పల్లెల సంక్షేమం లక్ష్యంగా మా ప్రభుత్వం చేస్తున్న కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం పల్లెల ప్రగతిని ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్. సీసీ రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం... ఒక్కటేమిటి అన్నిటినీ గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ఆఖరికి గ్రామాల అభివృద్ధికి కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను కూడా పక్కదారి పట్టించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
మంత్రి సత్య కుమార్ యాదవ్ కు తప్పిన ప్రమాదం
కంచికచర్ల మండలం పరిటాలలో మంత్రి సత్య కుమార్ యాదవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేస్తున్న సమయంలో మంత్రిపైకి ఓ ఆవు దూసుకొచ్చింది. మంత్రి పక్కనే ఉన్న ఆవు బెదరడంతో మంత్రి సత్య కుమార్ చేతికి తగులుతూ దూసుకొచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది ఆవును పక్కకు లాగడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మంత్రి సత్య కుమార్ పాటు ప్రక్కనే ఎంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య ఉన్నారు. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications