మా పథకాలు వద్దనడానికి కేంద్రానికేం హక్కు ఉంది?:యనమల
Recommended Video

అమరావతి: రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన పథకాలను ఎపి ప్రభుత్వం అమలు చేసోందని, ఇక్కడి ప్రజలకు ఏం కావాలో కూడా కేంద్రాన్నే అడగాలా?...అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
రాష్ట్ర పథకాలు వద్దనే హక్కు కేంద్రానికి ఎక్కడుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై స్పందించారు.

రాష్ట్ర పథకాలతో...మీకేం సంబంధం...
రాష్ట్రంలో అమలు చేస్తున్న కొన్ని పథకాలపైన కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని మంత్రి యనమల తెలిపారు. రాష్ట్రంలో ప్రజల కోసం అమలు చేసే పథకాలకూ కేంద్రం అనుమతి తీసుకోవాలా?...అని యనమల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు అవసరాల మేరకు పథకాలను గుర్తించి వాటిని తాము అమలు చేస్తామని,వాటిలో కొన్నింటికి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో కొంత భాగం నిధులు వస్తాయని, మిగిలిన నిధులను తామే భరించుకుంటున్నామని యనమల వివరించారు. అయినా కేంద్రానికి ఇలా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా నిధులు నిలిపివేయడం సాధ్యం కాదన్నారు. అంతగా అయితే అయితే గ్రాంట్ల ద్వారా ఇచ్చే నిధులను తగ్గించే అవకాశాలు ఉండొచ్చన్నారు. అయినా ఆర్థిక ఇబ్బందులు రాకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తునేఉన్నామన్నారు.

రెవిన్యూ లోటు ఇంత...అయినా కేంద్రం...
ఎపికి రావాల్సిన ఆదాయ లోటు విషయమై మాట్లాడుతూ 2014-15 కి రూ.16వేల కోట్ల వరకు రెవిన్యూ లోటు ఉందని రిజర్వ్ బ్యాంక్, కాగ్ కూడా నిర్ధారించాయన్న యనమల...నీతి అయోగ్ కూడా లోటు రూ. 14 వేల కోట్లని గుర్తించిందని చెప్పారు. వివిధ అధికారిక విభాగాలు నిర్ధారించిన లోటును కేంద్రం మాత్రం అంగీకరించడం లేదని విమర్శించారు.

పోలవరంపై విచారణ...ఎందుకు?
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు సంబంధించినదని, దీన్నిఆపాలనుకోవడం సరికాదని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటిదాకా తామే నిధులను భరించి కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ కోరుతున్నామని తెలిపారు. అయితే పోలవరం పనులపై కేంద్రం నిఘా పెట్టి విచారణ చేయిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ కు నిధులు తాము ఖర్చు చేస్తున్నా పనులు మొత్తం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కనుసన్నల్లోనే సాగుతున్నాయని, ప్రతి పైసా ఖర్చును ఆ అథారిటీయే చూస్తున్నప్పుడు మళ్లీ విచారణ దేనికని యనమల ప్రశ్నించారు.

అవిశ్వాసంపై చర్చ...అడ్డు తగులుతున్నారు...
లోక్ సభలో టిడిపి పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోందని యనమల ఆరోపించారు. ఎవరో కొంతమంది సభ్యుల ఆందోళనలను కారణంగా చూపిస్తూ చర్చను తిరస్కరించడం అన్యాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన బిల్లులను గొడవ సమయంలోనూ ఆమోదించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస చర్చను మాత్రం ఇలా గొడవ పేరుతో పక్కన పెట్టడం సరికాదని యనమల విమర్శించారు. కేంద్రంపై ఇదే మొదటి అవిశ్వాసం కావడం వల్ల నిబంధనల ప్రకారం తప్పనిసరిగా చర్చకు అనుమతించాల్సిన అవసరం ఉందని యనమల అభిప్రాయపడ్డారు. సభలో రోజూ గొడవ చేస్తున్నఅన్నాడిఎంకె పార్టీ కూడా బిజెపి చేతిలోని పార్టీయేననే విషయం గమనించాలని మంత్రి యనమల వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications