ఏపీలో ఆ మంత్రులకు ఆరు నెలల డెడ్ లైన్ : రెండేళ్లలో పాసయింది ఎవరు : ఎక్స్టెన్షన్ దక్కేదెవరికి...!!
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తన డ్రీం కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో రెండేళ్లు పూర్తయింది. సీనియర్లను కొందరిని పక్కన పెట్టి..కొత్త వారికి సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఊహించని విధంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించారు. సీనియర్లకు పదవులు రాలేదని అప్పటికే చర్చ మొదలవ్వటంతో... రెండు న్నారేళ్ల తరువాత ప్రస్తుత మంత్రుల పని తీరు ఆధారంగా కొనసాగించేదెవరిని...తప్పించేదెవరిని నిర్ణయం తీసుకుంటానని ఆనాడే సీఎం స్పష్టం చేసారు.
Recommended Video
మంత్రుల పని తీరు..వారి సమర్ధత ఆధారంగా సీఎం వారి ప్రోగ్రస్ కార్డులను సిద్దం చేసుకున్నారని సమాచారం. ప్రాంతాలు..సామాజిక సమీరణాల ఆధారంగా వారికి మంత్రి పదవులు కేటాయించినా..కొందరు సద్వినియోగం చేసుకోగా..మరి కొందరు వెనుక బడి ఉన్నారు. అటువంటి వారికి ఆరు నెలల సమయం డెడ్ లైన్ గా మారుతోంది. దీంతో..రెండున్నారేళ్ల పాలనలో సీఎం జగన్ ను..పార్టీని మెప్పించిందెవరు..ఎవరు కంటిన్యూ అవుతారు..ఎవరు వెనుకబడి ఉన్నారనే చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పటికే సర్వే సంస్థల నివేదికలు..గ్రౌండ్ లెవల్ రిపోర్టులు సేకరించినట్లుగా తెలుస్తోంది.
ధర్మన క్రిష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు
శ్రీకాకుళం జిల్లా నుండి మంత్రులుగా ఉన్న వారిలో ధర్మన క్రిష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద్ కేబినెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, స్పీకర్ గా ఉన్న సీతారాం సైతం కేబినెట్ లోకి వస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ధర్మాన ప్రసాదరావు స్పీకర్ గా నియమితులయ్యే అవకాశం ఉంటుంది. విజయనగరం నుండి బొత్సా సీనియర్ గా..పార్టీ వాయిస్ గా ఉన్నారు. ఆయన స్థానం పదిలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సైతం కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎస్టీ కోటాలో తూర్పు గోదావరికి చెందిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పోటీగా కనిపిస్తున్నా..ఎస్టీ మహిళ కావటంతో కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, విశాఖ నుండి అవంతి సైతం తన శాఖ పైన పట్టు సాధించారు. పార్టీ కోసమూ పని చేస్తున్నారు. ఆయనకు ఇబ్బంది ఉండకపోవచ్చని చెబుతున్నారు. తూర్పు గోదావరి నుండి కన్నబాబు కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహణ..ప్రభుత్వం పైన విమర్శలు వచ్చిన సమయంలో తిప్పి కొట్టటం.. పార్టీ వాయిస్ వినిపించటంలో మంచి మార్కులే సంపాదించారు. అయితే, సొంత జిల్లా..సొంత నియోజకవర్గంలో మాత్రం పార్టీ కేడర్ ను గతంలో లాగా పట్టించుకోవటం లేదనే చర్చ సాగుతోంది.
ఆళ్ల నాని తొలి నుండి విధేయత
పశ్చిమ గోదావరిలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నాని ఏడాది కాలంగా కరోనా వేళ కీలకంగా మారారు. ఆయన తొలి నుండి జగన్ పట్ల విధేయత చాటుతున్నారు. అవసరమైన సమయాల్లో కఠినంగా వ్యవహరించ లేక పోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. అయినా..మంత్రి పదవికి మాత్రం ఇబ్బందులు కనిపించటం లేదు. మరో మంత్రి తానేటి వనిత వివాదాలకు దూరంగా ఉంటారు. శాఖా పరంగా సమర్ధంగా పని చేస్తున్నా.. పార్టీ పరంగా జిల్లాలో యాక్టివ్ గా లేరనే వాదన ఉంది. క్రిష్ణా జిల్లాల్లో నాని స్క్వేర్ గా ముఖ్యమంత్రి పిలుచుకొనే పేర్ని నాని..కొడాలి నాని ఇద్దరూ సీఎంకు సన్నిహితులుగా మారారు. ఇద్దరి పదవులకూ ఢాకా కనిపించటం లేదు. మరో మంత్రి వెల్లంపల్లి మాత్రం అనేక ఆరోపణలు..విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఆయన విషయంలో సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో ఏకైక మంత్రిగా సుచరిత ఉన్నారు. మహిళా హోం మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, హోం మంత్రిగా అవసరమైన సమయాల్లో కఠినంగా ఉండటం...పార్టీ పైన విమర్శలు వచ్చిన సమయంలో తిప్పి కొట్టటం లో కొంత వెనుకబడి ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రకాశం నుండి ఇద్దరు మంత్రులూ సీఎంకు సన్నిహితులే. అందులో బాలినేని జిల్లా మొత్తంగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనిల్ ,మేకపాటిలపైన సీఎంకు మంచి నమ్మకం
ఇక, నెల్లూరులో ఇద్దరు మంత్రులు ఉన్నారు. అనిల్ పైన సీఎం భారీ అంచనాలతో మంత్రి పదవి ఇచ్చారు. మేకపాటి పైన సీఎంకు మంచి నమ్మకం ఉంది. ఈ జిల్లాలో సీనియర్లు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలు..సర్దుబాట్లు అవసరం అయితే మినహా ఈ ఇద్దరిలో మార్పు ఉండకపోవచ్చు. కర్నూలులో ఆర్దిక మంత్రి బుగ్గన కు ఎక్స్ టెన్షన లో ఎటువంటి ఇబ్బంది లేకపోవచ్చు. మరో మంత్రి జయరాం ఆరోపణలు ఎదర్కోవాల్సి వచ్చింది. అయితే, అవి నిరూపణ కాకపోయినా..కర్నూలు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో భాగంగా అవసమైతే ఆయన మార్పు ఉండే అవకాశం ఉంది. ఇక, చిత్తూరు లో పెద్దిరెడ్డి కొనసాగింపు పైన అనుమానాలు అవసరం లేదు. అదే విధంగా మరో మంత్రి నారాయణ స్వామి సైతం జగన్ కు విధేయుడిగా ఉన్నారు. దశల వారీగా మధ్యపాన నిషేధం ప్రకటన ఎన్నికల సమయం లో కీలకంగా మారనుండటం..చంద్రబాబు సొంత జిల్లా కావటంతో మార్పులు చేర్పులకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.
అనంతపురం నుండి శంకర నారాయణ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. అయితే, ఈ జిల్లా టీడీపీకి బేస్ ఉన్నది కావటంతో..పక్కా సామాజిక సమీకరణాలే ఇక్కడ మంత్రులుగా కొనసాగటం..కొత్త వారికి అవకాశం ఇవ్వటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కడప జిల్లా నుండి మైనార్టీ మంత్రిగా అంజాద్ బాషా పదవికి సైతం ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అయితే, అనూహ్య నిర్ణయాల్లో ముందుండే సీఎం జగన్ క్షేత్ర స్థాయి నుండి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అన్ని నివేదికలు.. సర్వే సంస్థల రిపోర్టుల ఆధారంగా జగన్ తన ఎన్నికల టీం పైన నిర్ణయం తీసుకోనున్నారు.