డీఎంకే ప్రభుత్వ పెద్దలతో ఏపీ మంత్రులు- చెన్నైలో కీలక భేటీ..!!
చెన్నై/అమరావతి: ఏపీ మంత్రులు తమిళనాడులో పర్యటించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు. తమిళనాడు సచివాలయంలో ఏ సమావేశం ఏర్పాటైంది. అసైన్డ్ భూముల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి విధానాలను అనుసరిస్తోందనే విషయంపై ఏపీ మంత్రులు సమీక్ష నిర్వహించారు. అసైన్డ్ భూములపై తలెత్తిన వివాదాలను ఎలా పరిష్కరించుకుంటోందనే అంశంపై ఆరా తీశారు.
రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సారథ్యంలో ఏర్పాటైన అసైన్డ్ ల్యాండ్స్ కమిటీ తమిళనాడులో పర్యటించింది. ఇవ్వాళ తమిళనాడు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో చెన్నైలోని సచివాలయంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ సమావేశం అయ్యారు. తమిళనాడు రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. అసైన్డ్ భూముల విషయంలో ప్రజలకు మేలు జరిగేలా, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని వచ్చేలా విధి విధానాలను రూపొందించాలనేది తమ లక్ష్యమని, దీనిపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోన్నాయి?.. ఎలాంటి మార్గదర్శకాలను అనుసరిస్తోన్నాయనేది అధ్యయనం చేస్తోన్నామని అన్నారు. అసైన్డ్ భూముల బదలాయింపుపై ఏర్పాటైన తమ కమిటీ ప్రభుత్వానికి సిఫారసులను చేయాల్సి ఉందని చెప్పారు.
పేద, మధ్య తరగతుల కుటుంబాల వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేలా సిఫారసులను రూపొందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సారథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారని ధర్మాన ప్రసాద రావు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా తాము పర్యటించాల్సి ఉందని, అక్కడి విధానాలను అధ్యయనం చేసిన అనంతరం తమ సూచనలు, సలహాలతో కూడిన సిఫారసు నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.