'జగన్ ఓర్వలేకే': మోహన్ బాబు చెప్తే.. ముద్రగడను కలిసిన హీరో విష్ణు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు బుధవారం నాడు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తుతున్నారు.
భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని కోట్లకు కోట్లు పెంచింది వైయస్ రాజశేఖర రెడ్డి కాదా అని ప్రశ్నించారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కోట్లు దండుకున్న జగన్ ఇప్పుడు మాపై నిందలు వేయడం సరికాదన్నారు.
జగన్ తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. తాత్కాలిక సచివాలయంపై విపక్షాల ఆరోపణలు సరికాదని మంత్రి నారాయణ చెప్పారు. జూన్ నెల నాటికి హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఏపీకి వస్తారని చెప్పారు.
తాత్కాలిక సచివాలయం రెండేళ్ల పాటు ఉంటుందని, ఆ తర్వాత ఆ భవనాన్ని వేరే రకంగా ఉపయోగించుకుంటామని అభిప్రాయపడ్డారు. జగన్ తన అక్రమాస్తులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రం కోసం ఆలోచించడం లేదన్నారు. జగన్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 5 ఏళ్లు ఎంపీగా ఉన్న జగన్ కడపకు ఏం చేశారన్నారు.
ముద్రగడను కలిసిన మంచు విష్ణు
ప్రముఖ నటుడు మంచు విష్ణు బుధవారం సాయంత్రం కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. తన తండ్రి పంపితే వచ్చానని ఆయన చెప్పారు. విష్ణు తండ్రి, నటుడు మోహన్ బాబు ఫోన్ చేసి ముద్రగడను పరామర్శించారు.
కాశ్మీర్ భారత్లో భాగం: వెంకయ్య
కాశ్మీర్ ముమ్మాటికి భారత దేశంలో భాగమేనని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో అన్నారు. దేశ ద్రోహులకు విశ్వవిద్యాలయాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పార్లమెంటు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విపక్షాలు లేవనెత్తే అంశాల పైన చర్చకు తాము సిద్ధమని చెప్పారు. విద్యార్థుల ముసుగులో కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వెంకయ్య ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఉద్దేశించి మండిపడ్డారు.