చేత కాకనే: కెసిఆర్ను ఏకేసిన ఎపి మంత్రులు
బాధ్యత గల ముఖ్యమంత్రి ఎవరు కూడా కె. చంద్రశేఖర రావు మాదిరిగా మాట్లాడబోరని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. చంద్రబాబుపై నిందలు వేయడం కెసిఆర్ చేతగానితనమేనని ఆయన అన్నారు. కృష్ణపట్నంలో కెసిఆర్ విద్యుత్తు వాటా అడిగితే తాము హైదరాబాదులో వాటా అడుగుతామని ఆయన అన్నారు.
కెసిఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. వివాదాలు రాకుండా కృష్ణా రివర్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆయన శనివారం కర్నూలులో అన్నారు. మరో డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా కెసిఆర్పై ధ్వజమెత్తారు. దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్ర పదజాలంతో సవాల్ కూడా విసిరారు.
హైదరాబాద్లో వాటా ఇస్తారా..
కృష్ణపట్నంలో వాటా ఉంటుందని అంటున్న కెసిఆర్ హైదరాబాదులో వాటా ఇస్తారా అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాట్లాడే ముందు కెసిఆర్ ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన విద్యుత్తు వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై నిందలు వేయడం సరి కాదని ఆయన అన్నారు. సెంటిమెంటుతో ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెట్టి దగా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ల్యాండ్ పూలింగ్పై నారాయణ
రైతులకు మేలు జరిగే విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. చండీఘడ్, రాయపూర్ తరహాలో ల్యాండ్ పూలింగ్ విధానం ఉంటుందని ఆయన శనివారం మీడియాతో చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో బేటీ తర్వాత ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.