సన్నాసి మాటలొద్దు-పవన్ కు బొత్స హెచ్చరిక- ధర్మాన వ్యాఖ్యల అంతరార్ధం ఇదే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్ పై, ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన విమర్శలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.
ఏపీలో వైసీపీ సర్కార్ పై రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ కౌంటర్ ఇచ్చారు. అన్నీ ఉన్నది అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంటదని బొత్స వ్యాఖ్యానించారు. సంప్రదాయాలు, చట్టాలు తెలిసిన వారికి అలాంటి ఆలోచనలు రావన్నారు. అవేమీ లేవు కాబట్టే ఎగిరెగిరి పడుతున్నాడని పవన్ ను ఉద్దేశించి విమర్శించారు. వాళ్లను కొడతా వీళ్లను కొడతా అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. వైసీపీ సర్కార్ రాజ్యాంగం, చట్టబద్ధంగా ఐదు కోట్ల మంది ప్రయోజనాల కోసం 26 జిల్లాల అభివృద్ధి కోసం ముందుకెళ్తోందన్నారు. నీకేంటి బాధ అని పవన్ ను బొత్స ప్రశ్నించారు.తనకే అన్నీ తెలుసన్నట్లు పవన్ మాట్లాడుతున్నారని, ప్రజలు నమ్ముతారని, అమాయకులని అనుకుంటున్నారేమో అని బొత్స ఆక్షేపించారు.
ఏదో ఒక అంశాన్ని తీసుకుని పవన్ క్లారిటీగా మాట్లాడాలని, అన్నీ అంశాల్ని కలిపేసి తీవ్రవాది అయిపోతే, ఎవర్నో కొట్టేస్తానని మాట్లాడటం సరికాదని బొత్స అన్నారు. ఎదురుగా కుర్రాళ్లను పెట్టుకుని చప్పట్లు కొట్టించుకుంటే అయిపోతుందా అని అడిగారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష మంచిదా అని ప్రశ్నించారు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. కేఏ పాల్ కూ, పవన్ కూ తనకు తేడా కనిపించడం లేదన్నారు. ఆయన కూడా కారు దిగిపోయి ఏవేవో మాట్లాడుకుంటూ వెళ్లిపోతుంటారని, పవన్ కూడా కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా హంగామా చేస్తుండ వచ్చని బొత్స వ్యంగాస్త్రాలు సంధించారు. దేశంలో చట్టబద్ధంగా ఏ కార్యక్రమమైనా చేసే హక్కు అందరికీ ఉందన్నారు. వారాహి తిప్పుకుంటానంటే ఎవరు అడ్డుపడ్డారని బొత్స ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే రాజకీయాల్లో ఎందుకు ఉన్నామని అనిపిస్తోందన్నారు.

తాము మూడు రాష్ట్రాలు అనలేదని, మూడు రాజధానులు మాత్రమే అన్నామని బొత్స తెలిపారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని పెడితే చంద్రబాబు, మీరు అడ్డుపడుతుంటే బాధతోనే ధర్మాన ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. వికేంద్రీకరణ తమ విధానమన్నారు. ధర్మాన చెప్పిన సందర్భాన్ని తీసుకోవాలని పవన్ కు సూచించారు. భూముల్ని, ఆస్తుల్ని కాపాడుకోవడానికి అమరావతి అంటున్నారని, తాము మాత్రం వెనుక బడిన ప్రాంతాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
పవన్ కు సినిమాల్లో ఎంతోమంది రైటర్లు ఉన్నారని, నిర్మాణాత్మకంగా వారితో సందేశాలు తయారు చేయించుకుని ఇచ్చుకోవచ్చుగా అని బొత్స సూచించారు. నిర్మాణాత్మకంగా ఏదైనా మాట్లాడితే ప్రయోజనం ఉంటుందన్నారు. ఉన్నవీ లేనివీ కల్పించుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాకు తెలియదా అని ప్రశ్నించారు. విశాఖ ప్రాంతంపై మాకు చిత్తశుద్ధి లేదా మేమేమైనా అమెరికా నుంచి వచ్చామా, మాకంటే ఎక్కువగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లా అని పవన్ ను బొత్స ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications