అసెంబ్లీలో విజయమ్మపై రవీంద్రనాథ్ ప్రమాణం, మళ్లీ...
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన స్వీకారం వివాదాస్పదంగా మారినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల సాక్షిగా అంటూ రవీంద్రనాథ్ రెడ్డి ప్రమాణం చేశారు. ఇది నిబంధనలకు విరుద్దమని అధికారులు తేల్చి చెప్పడంతో మరోసారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
మరోవైపు నియమావళి ప్రకారం ప్రమాణం చేయలని పలువురు ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభాపతి కోడెల శివప్రసాద్ మళ్లీ ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా నియమావళి ప్రకారం ప్రమాణం చేయని జవహర్, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎం వెంకటరమణలతో ప్రమాణం చేయించారు.
కాగా, అంతకుముందు అసెంబ్లీలో యనమల, వైయస్ జగన్ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో ఉన్నవి రెండే రెండు పార్టీలు అని ఓ వైపు పాలక పక్షం, రెండో వైపు ప్రతిపక్షం మాత్రమే ఉన్నాయని జగన్ అన్నారు. బీజేపీ పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఒక్కటైనందున మీరు తమవైపు వచ్చే వరకు అటువైపుగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.
దీంతో జగన్ వ్యాఖ్యలపై మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. మొన్నటి వరకు కలలు కన్న జగన్ ఇప్పుటికీ ఇంకా కలలు కంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలన్న జగన్ కలలు ఎప్పటికీ నిజం కావని, తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రతిగా స్పందించిన జగన్ ఎవరు ఎక్కడ ఉంటారనేది అంతా దేవుడే చూసూకుంటాడని అన్నారు. 1999లో కూడా మీలో ఇదే ఆత్మవిశ్వాసం కన్నించిందని, తమరొకటి తలిస్తే దేవుడు, ప్రజలు మరో తీర్పు నిచ్చారన్నారు. 2004 ఎన్నికల్లో ప్రజలు విపక్ష నేత వైయస్కు పట్టం కట్టారని, భవిష్యత్లోనూ ఇదే జరుగుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
హుందాగా మెలగండి: కోడెల
ప్రజలు సభను గమనిస్తుంటారని, హుందాగా మెదలాలని సభాపతి కోడెల శుక్రవారం అన్నారు. స్పీకర్గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. సభలో అధికార, ప్రతి పక్షాలు హుందాగా వ్యవహరించాలన్నారు. సభలో జరిగే చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు.
చర్చలు జరిగేవిధంగా అందరూ సహకరించుకోవాలని, అధికార, ప్రతిపక్షాలు పై చేయి కోసం కాకుండా.. అర్థవంతమైన చర్చలకు సహకరించుకోవాలన్నారు. రాష్ట్రం నాలుగు రోడ్ల కూడలిలో ఉందని, దిశా నిర్దేశనం చేయాల్సిన బాధ్యత సభ్యచుల పైన ఉందని చెప్పారు. ప్రజలు సభను చూసి అసహ్యించుకునే విధంగా ఉండవద్దన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం అందరం కృషి చేద్దామన్నారు. తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పారు.
ప్రతిపక్ష నేతగా జగన్
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని సభాపతి కోడెల శివప్రసాద్ ప్రకటించారు. అనంతరం సభను రేపటికి (శనివారం) వాయిదా వేశారు.