ఏపీలో సినిమా థియేటర్ల వివాదం: తెలంగాణ మంత్రి రాయబారం
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్లు, థియేటర్లపై దాడుల వివాదానికి తెర పడట్లేదు. పైగా మరింత రాజుకుంటోంది. సంక్రాంతి పండుగ సీజన్ సమీపించన వేళ.. కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదానికి శుభం కార్డు పడేలా కనిపించట్లేదు. అటు ప్రభుత్వం, ఇటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు తమ బెట్టు వీడట్లేదు..మెట్టు దిగట్లేదు. టాలీవుడ్ తరఫున దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశమైనప్పటికీ- ఫలితం కనిపించలేదు. ఈ చిక్కుమూడి వీడలేదు.
తాజాగా- ఈ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం సైతం జోక్యం చేసుకునే పరిస్థితులు కనిపిస్తోన్నాయి. టాలీవుడ్పై జగన్ సర్కార్తో పోల్చుకుంటే- తెలంగాణ ప్రభుత్వం కొంత సానుకూల ధోరణితోనే ఉంది. మెతక వైఖరిని అనుసరిస్తోంది. సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడాన్ని దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో- బెనిఫిట్ షో, అయిదో ఆటను వేయడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం.. అనుమతి ఇచ్చింది.
ఏపీలో కంటే తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు భారీగా ఉంటోన్నాయి. మల్టీప్లెక్సుల్లో ఈ తేడా మరింత ఎక్కువగా ఉంటోంది. ఏపీ తరహాలో తాము సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలను విధించదలచుకోలేదంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. టాలీవుడ్కు అనుకూలంగా తమ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రేక్షకుల ప్రయోజనాలను కూడా కాపాడుకుంటామని అన్నారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ ఎప్పటి నుంచో కేంద్రబిందువుగా ఉంటూ వస్తోందని గుర్తు చేశారు. చిత్ర పరిశ్రమ పెద్దల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని చెప్పారు. హైదరాబాద్ను ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్గా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఈ దిశగా పలు చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే టికెట్ల రేట్లను పెంచామని అన్నారు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన అఖండ, పుష్ప సినిమాలు టాలీవుడ్కు ఊపిరి పోశాయని, నిలదొక్కుకునేలా చేశాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఏపీలో నెలకొన్న వివాదంపై అవసరమైతే తాను రాయబారాన్ని వహిస్తానని మంత్రి తలసాని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వంతో తాను మాట్లాడతానని అన్నారు. సంబంధిత శాఖ మంత్రిని స్వయంగా కలవడం లేదా.. ఫోన్ ద్వారా సంప్రదిస్తానని చెప్పారు. వినోదాన్ని అందించే కళలు, కళాకారులు, సినీ పరిశ్రమకు సరిహద్దులు ఉండవని తలసాని వ్యాఖ్యానించారు. కులం, మతం ప్రాంతం అనే తేడా ఉండదని అన్నారు. వేలాదిమంది కార్మికులు ఆధారపడిన పరిశ్రమ కావడం వల్ల కొంత సానుకూలంగా వ్యవహరించడం తప్పదని చెప్పారు.












Click it and Unblock the Notifications