ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ఓటర్లు ఇవి పాటించాల్సిందే...
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. కడప జిల్లాలోని పులివెందుల,చిత్తూరు జిల్లాలోని పుంగనూరు,గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల,మాచర్ల నియోజకవర్గాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ నాలుగు చోట్ల పోలింగ్ జరగట్లేదు.

మొత్తం 2215 డివిజన్లు,వార్డులకు ఎన్నికలు...
పోలింగ్ జరుగుతున్న 12 కార్పోరేషన్లలో 671 డివిజన్లు ఉండగా.. 89 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 71 మున్సిపాలిటీల్లో 2,123 వార్డులు ఉండగా.. 490 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగతా 1633 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పోరేషన్లు,మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 2215 డివిజన్లు,వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 78 లక్షల 71 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.అటు ఏలూరు, చిలకలూరిపేట కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు...
ఈసారి పోలింగ్ బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తున్నారు.ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాకో నోడల్ అధికారిని నియమించారు. పోలింగ్ కోసం మొత్తం 7,915 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 2,320 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా,2,468 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. విజయవాడలో 21, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక జాబితాలో ఉన్నాయి.కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతీ ఓటరు ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరి. వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ తీరును పర్యవేక్షించనున్నారు.ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం 48,723 మంది అధికారులు, సిబ్బందిని నియమించింది. ఇందుకోసం రూ.30కోట్లు నిధులు విడుదల చేసింది.

ఓటర్లు ఇవి పాటించాల్సిందే...
ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు... తాను ఫలానా అభ్యర్థికి ఓటేశానని పోలింగ్ కేంద్రంలో బహిరంగపరిస్తే ఆ ఓటును రద్దు చేసే విచక్షణాధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అంతేకాదు,అతనిపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేయవచ్చు.పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లు అనుమతించరు. ఒకవేళ ఎవరైనా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలు దిగితే వారి ఓటు రద్దవుతుంది. రాజకీయ పార్టీల తరుపున పోలింగ్ కేంద్రానికి వచ్చే ఏజెంట్లు తాము ఆ పరిధిలోని ఓటర్లా కాదా అన్నది అధికారులకు తెలియజేయాలి. అంధులు,దివ్యాంగులు కుటుంబ సభ్యులు లేదా తెలిసినవారి సహకారంతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒకవేళ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే పరిస్థితిలో లేకపోతే... పోలింగ్ అధికారే నేరుగా వారి వద్దకు వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications