ఎన్టీఆర్కి అభిషేకం, సీన్రివర్స్తో బాబు హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్ర మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం సత్తా చాటింది. సీమాంధ్ర మున్సిపల్ ఫలితాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు ఏకపక్షంగా ఉంటాయనుకుంటే సీన్ రివర్స్ అయి... టిడిపి వైపు ఏకపక్షంగా మారాయి.
టిడిపిఅంచనాలకు మించి ఫలితాలు సాధించింది. ముప్పాతిక వంతు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను ఖాతాలో వేసుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా పోరాడిన జగన్ పార్టీ టిడిపి ముందు నిలవలేకపోయింది.
సీమాంధ్రలో ఎన్నికలు జరిగిన 92 మునిసిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ 65 స్థానాల్లో మెజారిటీ సాధించింది. వీటి పురపాలక సంఘాల అధ్యక్ష పదవులను సొంతం చేసుకోనుంది. మరో నాలుగు మునిసిపాలిటీలలో అవకాశముంది. జగన్ పార్టీ కేవలం 19 మునిసిపాలిటీలను మాత్రమే దక్కించుకోగలిగింది. టిడిపి గెలుపుతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.
తెలుగుదేశం
సీమాంధ్రలో ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఐదు సైకిల్ సొంతమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండింట గెలిచింది. గత మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటిన కాంగ్రెస్ ఈసారి చతికిల పడింది. విభజన దెబ్బకు కుదేలైపోయింది.
తెలుగుదేశం
సీమాంధ్రల్లోని 13 జిల్లాల్లో ఏకంగా పది జిల్లాల్లో మెజారిటీ మునిసిపాలిటీలను తెలుగుదేశం సొంతం చేసుకుంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురంతోపాటు జగన్ ఇలాకా కడపలోనూ టిడిపి ఆధిక్యం ప్రదర్శించింది.
తెలుగుదేశం
కర్నూలు జిల్లాలో మాత్రం తెలుగుదేశంకంటే జగన్ పార్టీ ఎక్కువ మునిసిపాలిటీలు దక్కించుకోగలిగింది. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఇరు పార్టీలకు సమానంగా మునిసిపాలిటీలు వచ్చాయి.
తెలుగుదేశం
కొన్ని జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాతా తెరవలేదు. తూర్పు గోదావరి జిల్లాలో పది మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా జగన్ పార్టీ ఒక్కచోటా మెజారిటీ వార్డులు గెలుచుకోలేకపోయింది. 9 మునిసిపాలిటీల్లో టిడిపి ఆధిక్యం ప్రదర్శించగా, ఒక మునిసిపాలిటీలో ఇరుపార్టీలకు సమాన స్థాయిలో కౌన్సిలర్ల సీట్లు లభించాయి.
తెలుగుదేశం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిదికి ఎనిమిది టిడిపి దక్కించుకుంది. గుంటూరు జిల్లాలో పన్నెండు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఏకంగా 11 స్థానాల్లో పచ్చ జెండా రెపరెపలాడింది. ఒక్కచోట ఫ్యాను గాలి వీచింది.
తెలుగుదేశం
అనంతపురం జిల్లాలో పదకొండు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. పదింట తెలుగుదేశానికే దక్కాయి. ఒకే ఒక్కటి ఫ్యానుకు చిక్కింది. మొత్తంగా హంగ్లు నెలకొన్న స్థానాలను వదిలేస్తే విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను తెలుగుదేశం క్లీన్స్వీప్ చేసింది.
తెలుగుదేశం
జగన్ సొంత జిల్లా కడపలో సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత మునిసిపల్ ఎన్నికల్లో టిడిపి ఆధిక్యం సాధించింది. ఆ జిల్లాలో ఎన్నికలు జరిగిన ఏడు మునిసిపాలిటీల్లో నాలుగు తెలుగుదేశానికి దక్కాయి. జగన్ పార్టీ మూడు చోట్ల నెగ్గింది.
తెలుగుదేశం
జగన్ సొంతగడ్డ పులివెందులలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం పరిపూర్ణంగా మారింది. అక్కడున్న 26 వార్డుల్లో 25 ఫ్యాను గెలుచుకొంది. టిడిపికి ఒక్క వార్డూ దక్కలేదు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టిడిపి ఆధిక్యం సాధించగలిగింది. ఎన్నికలు జరిగిన ఆరు మునిసిపాలిటీల్లో తెలుగుదేశానికి నాలుగు, జగన్ పార్టీకి రెండు దక్కాయి.
తెలుగుదేశం
శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకూ టిడిపి ప్రభంజనం భారీగా ఉండగా... నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రం జగన్ పార్టీ ప్రభంజనం కనిపించింది. కోస్తా జిల్లాలతో పోలిస్తే కృష్ణా జిల్లాలో జగన్ పార్టీ కొంతవరకూ టిడిపికి పోటీ ఇవ్వగలిగింది.
తెలుగుదేశం
ఆ జిల్లాలోని 8 మునిసిపాలిటీల్లో మూడింటిని గెలుచుకోవడంతోపాటు మిగిలిన చోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చింది. విజయవాడ కార్పొరేషన్లో మాత్రం బాగా వెనకబడిపోయింది.
తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ... కడప జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒక్క వార్డునూ గెలుచుకోలేకపోయింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, కొవ్వూరు మునిసిపాలిటీల్లో ఒక్క వార్డూ దక్కలేదు.
తెలుగుదేశం
తూర్పు గోదావరి జిల్లా తునిలో గత ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేని టిడిపి ఈసారి ఏకంగా మునిసిపాలిటీనే గెలుచుకుంది.
తెలుగుదేశం
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాచర్ల, రాయదుర్గం నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇప్పుడు అవే మునిసిపాలిటీల్లో టిడిపి గెలవడం గమనార్హం. చిత్తూరు పట్టణంపై గట్టి పట్టు ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే సికె బాబు సతీమణి కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయారు.