జగన్ దూకుడుతో ఒడిషా బెంబేలు-మరోసారి కేంద్రమంత్రి జోక్యం-తగ్గితే వారి వాదన నెగ్గినట్లే...
ఏపీ-ఒడిషా మధ్య సరిహద్దుల్లో చిచ్చు రేపుతున్న కొటియా గ్రామాల వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. కొటియా గ్రామాలు మావంటే మావంటూ ఇప్పటికే ఇరు రాష్ట్రాలు పోరాడుతుండగా.. తాజాగా అక్కడ వైసీపీ సర్కార్ దూకుడుతో ఒడిశా బెంబేలెత్తుతోంది. దీంతో కొటియా వివాదంపై చర్చలకు రావాలని ఇప్పటికే ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఇప్పుడు కొటియా గ్రామాల్లో ఒడియా మీడియం అమలు చేయాలని కోరుతూ ఆయన జగన్ కు మరో లేఖ రాశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు.
ఏపీ-ఒడిషా మధ్య కొటియా చిచ్చు
ఏపీ-ఒడిశా మధ్య సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతున్న కొటియా గ్రామాల చిచ్చు రోజురోజుకూ తీవ్రమవుతోంది. కొటియా గ్రామాలు మావంటే మావంటూ ఇరు రాష్ట్రాలు తన్నుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడ పరిస్ధితులు దిగజారుతున్నట్లు గ్రహించిన ఒడిషా రంగంలోకి దిగుతోంది. అయితే సీఎం నవీన్ పట్నాయక్ కు బదులుగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇందులో కీలకంగా మారిపోతున్నారు. కొటియా గ్రామాల సమస్యపై ఏపీతో చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ఆయన ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కొత్తగా మరో సమస్య తలెత్తింది.
జగన్ దూకుడుతో ఒడిషా బెంబేలు
కొటియా గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అక్కడ వైసీపీ సర్కార్ నవరత్నాల్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్.. సరిహద్దుల్లోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ తెలుగు మీడియాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అయితే సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఒడిశా విద్యార్ధఉలు తెలుగు మీడియంలో చదువుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరిగి ఈ వివాదం ఒడిషా నేతలకు ఇబ్బందికరంగా మారిపోతోంది. ఇప్పటికే కొటియా వ్యవహారంలో జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవడంతో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వెనక్కి తగ్గారు. ఏపీ సర్కార్ తో మాట్లాడే అవకాశాన్ని బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల్లో పెట్టేశారు. దీంతో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఈ కొటియా గ్రామాలతో పాటు ఏపీలోని సరిహద్దు గ్రామాల్లో ఒడియా అమలుపైనా జగన్ కు లేఖ రాశారు.
ఒడియా మీడియం అమలుకు పట్టు
ఏపీ-ఒడిషా సరిహద్దు జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం లోని పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఒడియా మీడియం కూడా అమలు జరిగేది. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ తెలుగు మీడియం మాత్రమే అమలు చేస్తోంది. ఇది ఒడిషా నుంచి వచ్చి స్ధిరపడిన వారికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఏపీ-ఒడిషా సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామాల్లో ఎక్కువగా ఒడియా మాట్లాడుతుంటారు. దీంతో అక్కడ ఒడియా మీడియం అమలుకు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ అలా చేస్తే వైసీపీ సర్కార్ లక్ష్యం నెరవేరదు. కొటియా గ్రామాల విషయంలో ఇప్పటికే పోరాడుతున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు తమ రాష్ట్రంలోని స్కూళ్లలో ఒడియా అమలుకు సిద్ధం కావడం లేదు. దీంతో విద్యార్ధుల ఇబ్బందులు పెరుగుతున్నాయి.
జగన్ కు ధర్మేంద్రప్రధాన్ మరో లేఖ
ఏపీ పరిధిలోకి వచ్చే స్కూళ్లలో ఒడియా మీడియం అమలు చేయాలంటూ సీఎం జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా ఓ లేఖ రాశారు. ఇప్పటికే ఆయన కొటియా గ్రామాల వివాద పరిష్కారానికి ముందుకు రావాలంటూ జగన్ కు ఓ లేఖ రాశారు. ఇప్పుడు ఒడియా మీడియం అమలుపైనా లేఖ రాశారు. ఒడిషా, ఏపీ సరిహద్దు వివాదాల వల్ల ఇరు రాష్టాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న విద్యార్ధులు అక్కడ మైనార్టీలుగా మారిపోతున్నారు. కాబట్టి జగన్ జోక్యం చేసుకుని ఈ గ్రామాల్లో ఒడియా మీడియం అమలుకు నిర్ణయం చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ కోరుతున్నారు. దీనిపై ఏపీ సర్కార్ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారబోతోంది.
ఒడిషాకు ఎక్కడికక్కడ జగన్ చెక్
కొటియా గ్రామాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న జగన్.. మన రాష్ట్రంలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో సైతం ఒడియా మీడియం అమలును ప్రోత్సహించడం లేదు. దీంతో అక్కడి ఒడియా విద్యార్దులు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్ధితులు తలెత్తుతున్నాయి. దీనిపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖలు రాస్తున్నా జగన్ సర్కార్ నుంచి కనీస స్పందన లేదు. తద్వారా ఒడిషా విజ్ఞప్తుల్ని పట్టించుకునే పరిస్దితుల్లో తాము లేమంటూ జగన్ సంకేతాలు పంపుతున్నారు. గతంలో సీఎం నవీన్ పట్నాయక్ ప్రతిపాదనలు చేసినా పట్టించుకోని జగన్.. ఇఫ్పుడు కేంద్రమంత్రి స్ధాయిలో ధర్మేంద్ర ప్రధాన్ లేఖల్ని కూడా పట్టించుకోకపోవడం చూస్తుంటే ఒడిషాకు ఎక్కడికక్కడ చెక్ పెట్టాలనే ధోరణి కనిపిస్తోంది.