కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ విపక్షాల సమర్ధన-అక్షరసత్యమని వెల్లడి-వైసీపీ ఉలికిపాటుపై ప్రశ్నలు
ఏపీలో కరెంటు లేదు, నీళ్లు లేదు, రోడ్లు బాగోలేవంటూ నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యల్ని ఏపీలో మంత్రులంతా తప్పుబట్టారు. నిన్నటి నుంచి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో విపక్షాలు దీనికి కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులకు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు సీపీఐ జాతీయ నేత నారాయణ తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలు, దానికి వైసీపీ మంత్రుల కౌంటర్ల నేపథ్యంలో ఏపీ-తమిళనాడు సరిహద్దులకు వెళ్లి మరీ వాస్తవ పరిస్ధితిని ఆయన వివరించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, పొరుగున ఉన్న తమిళనాడులో సైతం రోడ్లు ఎంతో బావున్నాయని ఆయన ఆధారాలతో సహా వివరించారు. చివరికి తన స్వగ్రామం అయనంబాకం వెళ్లే రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని నారాయణ ఆరోపించారు.
మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యల్ని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా సమర్ధించారు. ఏపీలో రోడ్లు, అభివృద్ధిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని డీఎల్ తెలిపారు. తన కుమార్తెలు హైదరాబాద్ లోనే ఉన్నారని, అక్కడ కరెంటు కోతలు లేవంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు. హైదరాబాద్ లో కరెంటు కోతలున్నాయంటూ వైసీపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల్ని డీఎల్ తప్పుబట్టారు. దేశమంతా విద్యుత్ కోతలున్నా ఏపీలో మాత్రం అప్రకటిత విద్యుత్ కోతలున్నాయంటూ డీఎల్ విమర్శించారు.
అటు టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైతం కేటీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధించారు. కేటీఆర్ వాస్తవాలు మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు బుకాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్ ను చేతకానివాడిగా చూస్తోందని కొల్లు రవీంద్ర విమర్శించారు. కేటీఆర్ ఏపీకి వస్తే వైసీపీ నేతలు ఏం చూపిస్తారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. మూసేసిన అన్న క్యాంటీన్లు, పడకేసిన పోలవరం, సెల్ ఫోన్ల లైటింగ్ లో ఆస్పత్రుల్లో వైద్యం, అమరావతిలో పిచ్చిమొక్కలు, రాజధాని పేరుతో విశాఖలో చేసిన భూకబ్జాలు చూపిస్తారా అని వైసీపీ మంత్రుల్ని ప్రశ్నించారు.