AP Panchayat Elections: ఏకగ్రీవాల కోసం జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ: రూ.లక్షల్లో నజరానా
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..ఎన్నికలకు వెళ్లడానికి పెద్దగా సుముఖంగా లేకపోయినప్పటికీ.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించి తీరాల్సిన ఆవశ్యకతను ఎదుర్కొంటోంది. ఎన్నికలను వాయిదా వేయించడానికి ఇదివరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో బరిలో దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక రాజకీయంగా వ్యూహాలకు పదును పెడుతోంది. కొత్త ఎత్తుగడను రూపొందిస్తోంది.
Nimmagadda ఎత్తుకు పైఎత్తు: ద్వివేదీ, గిరిజాశంకర్పై కొత్త అస్త్రం: సర్వీస్కే మచ్చ తెచ్చేలా
ఏకగ్రీవాల కోసం..
క్షేత్రస్థాయిలో జరగబోయే ఈ ఎన్నికల్లో పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది జగన్ సర్కార్. ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా నజరానాలను ప్రకటించింది. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్లల్లో ఇప్పటికే అమల్లో ఉన్న విధానాన్ని అనుసరించబోతోంది. ఆ ఫార్ములాకు అనుగుణంగా ఏకగ్రీవ పంచాయతీలకు లక్షల రూపాయల కొద్దీ నజరానాలను ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే జీవోను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ జీవోను విడుదల చేశారు.
2000 జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీలకు..
జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలన్నిింటినీ ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఈ కేటగిరీ ప్రకారం.. జనాభా రెండు వేల లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించితే.. ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల నజరానాను ఇస్తుంది. రెండు వేల నుంచి అయిదు వేల లోపు జనాభా ఉండే పంచాయతీల్లో ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికను నిర్వహించితే.. 10 లక్షల రూపాయల రివార్డ్ అందుతుంది. అయిదు వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగితే 15 లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది.
10 వేల జనాభా దాటితే..
ఇక 10 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించితే.. 20 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం అందజేస్తుంది. గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే అవాంఛనీయ సంఘటనలను నివారించడంతో పాటు జాతిపిత మహాత్మాగాంధీ, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి ఇది తొలి అడుగు అవుతుందని ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టం చేసింది. ఇదే విధానాన్ని తెలంగాణ సహా గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అమలు చేస్తున్నాయని పేర్కొంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీద జీవో..
ఈ జీవో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేరు మీద విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదీ వ్యవహరిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ
పేరు మీదే జీవో విడుదలైనప్పటికీ.. ద్వివేదీకి బదులుగా ఆదిత్యనాథ్ దాస్ పేరును పొందుపరిచారు. దీన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను ప్రభుత్వం పాటించినట్టే. గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్పై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఫోటోలు: ఏపీలో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ హరిచందన్ సీఎం జగన్
Recommended Video