వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల దూకుడు.. త్వరలో మరిన్ని ఉద్యోగాలు, ప్రకటించిన మంత్రి!
తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల దూకుడు కొనసాగుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చి, వైద్య విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళటంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వైద్య-ఆరోగ్య శాఖలో నిరంతర నియామకాలు చేపట్టింది. ఈ క్రమంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో కీలక మైలురాయిని సాధించింది.
433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లలోని 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను బోర్డు విజయవంతంగా భర్తీ చేసింది. తాజాగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఇందులో 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల సెలక్షన్ జాబితా కూడా ఉంది.

607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
గతంలో బోర్డు 34 విభాగాలకు చెందిన మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ వంటి ముఖ్య విభాగాల్లోని 174 పోస్టుల భర్తీ ఇప్పటికే పూర్తయింది. ఆ ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవల నియామక పత్రాలు అందజేశారు.
త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామన్న మంత్రి దామోదర రాజనర్సింహ
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేస్తాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, టీచింగ్ హాస్పిటల్స్లో మానవ వనరులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
ఆరోగ్యశాఖ పరిధిలో సుమారు 15 వేల పోస్టుల భర్తీ
గత రెండున్నర సంవత్సరాల్లో ఆరోగ్యశాఖ పరిధిలో సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్టు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది తదితరులు ఇందులో ఉన్నారు. ఈ నియామకాల వల్ల ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడి, సాధారణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత సమస్యను తీర్చేలా నియామకాలు
ఈ నియామకాలు తెలంగాణలో వైద్య విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత సమస్యను గణనీయంగా తగ్గిస్తాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి . ప్రభుత్వం ఈ తరహా నియామకాలను కొనసాగించాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications