నిమ్మగడ్డపై చర్యలు -అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీలో రచ్చ -కీలక నిర్ణయం -జగన్ వెనక్కి తగ్గారా?
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశాలున్న కీలక అంశాన్ని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మంగళవారం చర్చించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణకు ఇచ్చిన ప్రవిలేజ్ మోషన్ పై ప్రధానంగా చర్చ జరిగింది. తన వద్దకు వచ్చిన ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రివిలేజ్ కమిటీకి పంపడంతో ఇవాళ్టి భేటీ జరిగింది. ఇందులో..
జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ
వర్చువల్ భేటీలో రచ్చ..
ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ భేటీ అయింది. చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రివిలేజ్ కమిటీ వర్చువల్ విధానంలో సమావేశం అయ్యింది. అసెంబ్లీ రూల్స్ ను, గతంలో మహారాష్ట్ర ఎస్ఈసీ ఉదంతాన్ని ఉదహరిస్తూ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార వైసీపీ సభ్యులు వాదించగా, అది రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో వర్చువల్ భేటీలో రచ్చ జరిగింది. కాగా..
నిమ్మగడ్డను పిలవాల్సిందే..
మంత్రులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యాఖ్యలు, గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు ముమ్మాటికీ అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి సభ్యుల హక్కులకు భంగకరంగానూ ఉన్నాయని ప్రివిలేజ్ కమిటీలోని వైసీపీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలోని రూల్ నెం 212, 213 కింద ఎస్ఈసీని ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలింపించవచ్చని వారు తెలిపారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని ప్రివిలేజ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కానీ ఈ వాదనతో టీడీపీ సభ్యులు విభేదించారు.
ఎస్ఈసీకే పూర్తి అధికారాలు..
ఎన్నికల సమయంలో కమిషనర్ కు విశేష అధికారాలు లభిస్తాయని, ఆర్టికల్ 243 ప్రకారం నిమ్మగడ్డకు సర్వాధికారాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆయనను ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఎలా పిలిపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. నిమ్మగడ్డకు నోటీసులు పంపే విషయమై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో వారంలోపే ఆన్లైన్లో కాకుండా నేరుగా సమావేశం కావాలని కమిటీ నిర్ణయయించింది. అంతేకాదు, ఎస్ఈసీ అంశం సున్నితమైనది కావడంతో దీనిపై విస్తృతంగా చర్చించాలని ప్రివిలేజ్ కమిటీ భావించింది. నిజానికి..
మహారాష్ట్రలో ఏం జరిగింది?
అసెంబ్లీ రూల్స్ ప్రకారం మంత్రులు ఫిర్యాదు చేసిన సందర్భంలో ఎస్ఈసీపైనా చర్యలు తీసుకోవచ్చని ప్రివిలేజ్ కమిటీలో వాదించిన వైసీపీ సభ్యులు మహారాష్ట్ర ఉదంతాన్ని పదే పదే ప్రస్తావించారు. 2008లో మహారాష్ట్రలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపింది. అయితే, నోటీసు తీసుకునేందుకు ఎస్ఈసీ నిరాకరించారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ.. సభా హక్కుల ఉల్లంఘన కింద అసాధారణ రీతిలో ఎస్ఈసీకి 7 రోజుల జైలు శిక్ష విధించింది. దీనిపై ఎస్ఈసీ.. గవర్నర్ను, కోర్టులను ఆశ్రయించినా ఊరట లభించలేదు. ఈ వివాదం రెండేళ్ల పాటు కొనసాగింది. కాగా, ఈ వివాదం తర్వాత ఎస్ఈసీ అధికారాలను నిర్వచిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూ ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా,
లీగల్ చిక్కులు? జగన్ వెనక్కి తగ్గారా?
ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారాన్ని చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మంగళవారం భేటీ కావడానికి ముందు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తమ అధికారాల్లోకి జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్లు పరస్పరం ఆరోపణలు చేసుుకంటున్న దరిమిలా, ఇవాళే నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ప్రివిలేజ్ కమిటీ వ్యవహరించడం గమనార్హం. స్పీకర్ సిఫార్సు చేసిన ఫిర్యాదు విచారణకు అర్హమైనదిగా ప్రివిలేజ్ కమిటీ ఇవాళ నిర్దారించిందని, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున సభ్యులంతా బిజీగా ఉన్నారని, త్వరలోనే మరోసారి నేరుగా భేటీ కావాలని నిర్ణయించుకున్నామని కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాకు చెప్పారు. తద్వారా ఎస్ఈసీపై తక్షణ చర్యలు ఉండబోవని స్పష్టమైపోయింది. నిమ్మగడ్డతో పోరులో ఇప్పటికే పలు మార్లు కోర్టుల్లో దెబ్బతిన్న జగన్.. లీగల్ చిక్కుల నేపథ్యంలో వెనక్కి తగ్గారా? అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కానీ కాకాని మాత్రం ఎస్ఈసీపై చర్యల విషయంలో ప్రివిలేజ్ కమిటీ ముందుకే వెళుతుందని స్పష్టం చేశారు.
Recommended Video
నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ