పంచాయితీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు -జగన్ దిమ్మతిరిగేలా టీడీపీ స్ట్రాటజీ
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నాలుగు విడతల పంచాయితీ ఎన్నికలకుగానూ ఆదివారం సాయంత్రంతో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో ఏకగ్రీవాలు, వైసీపీ, సీఎం జగన్ లను ఉద్దేశించి చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు.

175 నియోజకవర్గాల బాధ్యులతో
పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చంద్రబాబు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ప్రజాప్రతినిధులు, కీలక నేతలు పాల్గొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాద్యత టీడీపీదే అని, ఎన్నికల విషయంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని, వైసీపీతో తాడోపేడో తేల్చుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏకగ్రీవాల అడ్డగింతకు స్ట్రాటజీ..
అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతొందని చంద్రబాబు ఆరోపించారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలంటే ప్రతి ఒక్క స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులచేత నామినేషన్లు వేయించే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయాలని శ్రేణులకు నిర్దేశించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎదురవుతోన్న ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామన్న ఆయన.. టీడీపీ బలపర్చుతోన్న అభ్యర్థుల విషయంలో బెండోవర్ కేసులు, కిడ్నాప్ల తో భయపెట్టాలని చూస్తూ సహించబోమని హెచ్చరించారు. పంచాయితీ ఎన్నికలపై కచంద్రబాబు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

వైసీపీ గెలిస్తే ఊళ్లన్నీ శ్మశానాలే
''పంచాయితీ ఎన్నికల్లో ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజల్ని ప్రలోభపెట్టాలని చూసే ఆ కుట్రలను తిప్పికొట్టాలి. అలాంటి ఘటనలపై ఎక్కడికక్కడే ఫిర్యాదులు చేయాలి. పంచాయితీ ఎన్నికలను టీడీపీ శ్రేణులంతా సీరియస్గా తీసుకోవాలి. వైసీపీ గుండాల చేతుల్లోకి మన గ్రామాలు వెళ్తే ప్రతి పల్లెకు కన్నీరే. మీ ఊరి బాగు మీ చేతుల్లోనే ఉంది. గ్రామాల్లో ప్రశాంతతను కాపాడాలి. ఈ ఎన్నికల్లో గనుక వైసీపీ వాళ్లు గెలిస్తే.. ఊళ్లన్నీ వల్లకాడు(శ్మశానాలుగా) చేస్తారు. అది గజరగకుండా ఉండాలంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి..

టీడీపీ ద్వారానే గ్రామస్వరాజ్యం
రాష్ట్రంలో టీడీపీ ద్వారానే నిజమైన గ్రామస్వరాజ్యం సిద్ధిస్తుందన్నది వాస్తవం. గ్రామాభివృద్దికి టీడీపీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే జన్మభూమి-మావూరు, స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు, గ్రామదర్శని, పచ్చదనం-పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం. వైసీపీ వచ్చాక వాటన్నింటిని రద్దు చేసింది. టీడీపీ పాలనలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు.. ఇవాళ కళావిహీనంగా మారాయి. అంతేనా..

జగన్కు గుణపాటం చెప్పాలి..
టీడీపీ హయాంలో పచ్చగా విలసిల్లిన గ్రామాలను ఇప్పుడు కక్షా కార్పణ్యాలకు వేదికలుగా గ్రామాలను వైసీపీ మార్చింది. హింస, విధ్వంసాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలపై దమనకాండకు పాల్పడుతోంది. చివరికి దేవాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. వీటన్నింటికీ గుణపాఠం చెప్పే అవకాశం ఈ ఎన్నికల రూపంలో వచ్చింది. నాయకత్వ సామర్ధ్యానికి పరీక్ష ఈ గ్రామ పంచాయితీ ఎన్నికలు. సమర్ధులైన వాళ్లే సర్పంచులుగా ఎన్నికయ్యేలా చూడాలి. అప్పుడైతేనే..

వైసీపీ రౌడీలు రాకుండా చూడండి..
భవిష్యత్తులో నాయకులుగా ఎదిగే వేదికలు గ్రామ పంచాయితీలే అని మనం మరువొద్దు. సర్పంచ్గా ఎన్నికై, ఆ తరువాత అంచెలంచెలుగా అసెంబ్లీకి, పార్లమెంటు స్థాయికి ఎదిగిన నాయకులను అనేకమందిని చూశాం. గ్రామంలో చేపట్టే అభివృద్ది, సంక్షేమ పనుల పర్యవేక్షణ బాధ్యత గ్రామసభ, సర్పంచ్లదే. ప్రధాని, ముఖ్యమంత్రి పాల్గొనే సభల్లో కూడా పెద్దపీట సర్పంచ్లకే. గ్రామంలో అత్యున్నత గౌరవం సర్పంచ్కే. అతటి కీలకమైన సర్పంచ్ పదవులను వైసీపీ రౌడీల పరం చేస్తే ఏపీకి అధోగతే. ఇలాంటి పరిస్థితులు రాకుండా టీడీపీ నేతలందరూ చూసుకోవాలి'' అని తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు.












Click it and Unblock the Notifications