విజయవాడలో పీసీబీ, మైనింగ్ పత్రాల దహనం కలకలం ! సమీర్ శర్మ పేరు చెప్పిన డ్రైవర్ ?
ఏపీలో ప్రభుత్వ మార్పు నేపథ్యంలో కీలక పత్రాల మాయం, దహనం ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తేలిపోవడంతో సీఐడీ కార్యాలయం వద్ద కీలక పత్రాలను పోలీసులే దహనం చేస్తూ దొరికిపోయారు. ఇలాంటిదే మరో ఘటన విజయవాడలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. విజయవాడ-అవనిగడ్డ కరకట్ట రోడ్డుపై ఇలా ప్రభుత్వ పత్రాలు, హార్డ్ డిస్క్ లను దహనం చేస్తూ ఇద్దరు దొరికిపోయారు.

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి కొందరు తగలబెట్టారు. ఈ పత్రాల్లో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అధికార నేతలకు సమాచారం అందించారు.

ఈ పత్రాలు కాల్చేసిన తర్వాత దుండగులు కారుతో యనమలకుదురు వైపు పరారవుతున్నట్లు గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడికి చేరుకుని కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్దం చేసినట్లు డ్రైవర్ నాగరాజు చెప్పినట్లు తెలుస్తోంది.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డు లు దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు తెలిపాడు. హెడ్ ఆఫీస్ లో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, సమీర్ శర్మ ఒయస్.డి రామారావు ల పాత్ర ఉన్నట్లు పేర్కొన్నాడు. సమీర్ శర్మ ఆదేశాలతో డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు గోను సంచుల్లో దాచినట్లు వెల్లడించాడు. వారి ద్వారా కారుల్లో ఎక్కించుకుని తెచ్చి దగ్ధం చేసినట్లు చెప్పాడు.












Click it and Unblock the Notifications